బాల‌య్య హ్యాట్రిక్ ప‌క్కా.. కానీ చీలే ఓట్లెన్ని?

హిందూపురం.. టీడీపీ కంచుకోట‌ల్లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇదొక‌టి. ఇక్క‌డ టీడీపీకి ఎదురేలేదు. వ‌రుస‌గా రెండు సార్లు గెలిచిన నంద‌మూరి బాల‌కృష్ణ ఈ సారి హ్యాట్రిక్ కొట్ట‌డం ఖాయ‌మ‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఆయ‌న విజ‌యాన్ని అడ్డుకునే నాయ‌కుడే లేర‌ని అంటున్నారు. గెలుపు అయితే ప‌క్కా కానీ ఈ సారి మాత్రం బాల‌య్య మెజారిటీ త‌గ్గే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. అందుకు స్వంతంత్ర అభ్య‌ర్థి ప‌రిపూర్ణానంద స్వామి పోటీలో ఉండ‌ట‌మే కార‌ణ‌మ‌ని చెబుతున్నారు.

ఈ సారి హిందూపురంలో బాల‌య్య‌కు చెక్ పెట్టాల‌ని వైసీపీ తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. బీసీ వ‌ర్గానికి చెందిన తిప్పేగౌడ నారాయ‌ణ్ దీపిక‌ను ఆ పార్టీ బ‌రిలో దించింది. వైసీపీ ఓటు బ్యాంకు మొత్తం అటు వైపే మ‌ళ్లింద‌నే టాక్ ఉంది. అయినా బాల‌య్య‌కు వ‌చ్చిన ఇబ్బందేమీ లేదు. కానీ టీడీపీ ఓటు బ్యాంకులో కొంత‌మంది స్వ‌తంత్ర అభ్య‌ర్థి అయిన ప‌రిపూర్ణానంద స్వామి వైపు మొగ్గుచూప‌డం మాత్రం కాస్త దెబ్బ‌తీసేదే. బాల‌య్యకు ప‌డే ఓట్ల‌ను స్వామిజీ చీల్చార‌నే చెప్పాలి. 2019లో బాల‌య్య సుమారు 28 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ సారి కూడా గెలుపు ఆయ‌న‌దే కానీ ఆ మెజారిటీ మాత్రం త‌గ్గొచ్చ‌న్న‌ది విశ్లేష‌కుల మాట‌.

కానీ మ‌రోవైపు వైసీపీ అభ్య‌ర్థిపై స్థానిక నాయ‌కుల్లో విభేదాలు వ్య‌క్త‌మ‌య్యాయ‌ని తెలిసింది. దీంతో వైసీపీ క్యాడ‌ర్‌లోని కొంత‌మంది కూడా బాల‌య్య‌కే జై కొట్టార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో బాల‌య్య ఎంత మెజారిటీ సాధిస్తార‌న్న‌ది ఇప్పుడు ఉత్కంఠ‌గా మారింది. మ‌రి అది తేలాలంటే జూన్ 4 వ‌ర‌కు ఆగాల్సిందే.