జనసేనలోకి వంగా గీత.!? అసలేం జరుగుతోంది.?

పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద పోటీకి దిగిన వైసీపీ ఎంపీ (కాకినాడ) వంగా గీత, జనసేన పార్టీలోకి జంప్ చేయబోతున్నారా.? పోలింగుకి ముందే వంగా గీత, జనసేనలోకి జంప్ చేస్తారన్న పుకార్లు ఎలా పుట్టాయి.? ఓటమి ఖాయమవడంతో వంగా గీత, జనసేనలోకి చేరతారన్న ప్రచారంలో నిజమెంత.?

వంగా గీత విషయంలోనే కాదు, చాలామంది వైసీపీ అభ్యర్థుల విషయంలో ఈ ప్రచారం చాలా గట్టిగా జరుగుతోంది. 151 కంటే ఎక్కువ సీట్లను గెలవబోతున్నాం.. అని ఇటీవల ఐ-ప్యాక్ టీమ్‌తో ముచ్చట్ల సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

వైఎస్ జగన్ చెప్పేదే నిజమైతే, వైసీపీ అభ్యర్థులెందుకు ఇతర పార్టీల వైపు చూస్తారు.? వైఎస్ జగన్ ఏమైనా చెప్పొచ్చుగాక. కానీ, గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితులు వేరేలా వున్నాయ్. వైసీపీ శ్రేణుల ఆశ ఏంటంటే, బొటాబొటి మెజార్టీతో అయినా, అధికారంలోకి వస్తే, ఆ తర్వాత విపక్షాల్ని నిర్వీర్యం చేసెయ్యొచ్చు.. అసలంటూ విపక్షాలే లేకుండా చేసెయయ్యడానికి వీలవుతుందని.

కానీ, గెలుపుపై కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) చాలా ధీమాగా వున్నాయి. 120 ప్లస్ సీట్లతో అధికారం కైవసం చేసుకుంటామని కూటమి నేతలంటున్నారు. 160 ప్లస్ రావొచ్చునని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెబుతున్న సంగతి తెలిసిందే.

ఎన్నికల ముందరే చాలామంది వైసీపీ నేతలు, అందునా ప్రజా ప్రతినిథులు వైసీపీని వీడి, టీడీపీలో చేరిపోయారు. ఎన్నికలయ్యాక, వైసీపీ గనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేకపోతే, వైసీపీ ఖాళీ అయిపోవడానికి పెద్దగా సమయం కూడా పట్టదు.

ఎటూ గెలిచే అవకాశం లేదన్న భావనతో వున్నారేమో, వంగా గీత ఒకింత తొందరపడుతున్నారు. చిరంజీవి పట్ల అభిమానాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చాటుకోవడం వైసీపీ శ్రేణులకు అస్సలు మింగుడుపడ్డంలేదు. పైగా, పవన్ కళ్యాణ్ మీద తానెక్కడా విమర్శలు చేయలేదని చెబుతుండడం వైసీపీని బాగా ఇబ్బంది పెడుతోంది.