రేపే ర‌ణ‌భేరి.. ‘గాంధీ’ల ప‌రువు ద‌క్కుతుందా?

దేశంలో జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఐదో ద‌శ పోలింగ్ సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. మొత్తం 6 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంటు స్థానాలకు సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 5వ దశలో ఉత్తరప్రదేశ్ లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమబెంగాల్ లో 7, ఒడిషాల్లో 5, బీహార్ లో 5, జార్ఖండ్ లో 3, జమ్మూ, లడ్డాఖ్ లో ఒక్కొక్క స్థానానికి పోలింగ్ జరగనుంది.

వీటిలో ప్రధానంగా గాంధీల కుటుంబాలకు కంచుకోటల వంటి అమేథీ , రాయబరేలీ వంటి కీలక స్థానాలు ఉన్నాయి. అమేథీ నుంచి బీజేపీ నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు. రాయబరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ బరిలో ఉన్నారు. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ జమ్ము, లడ్డాఖ్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది.

జమ్ము లడ్డాఖ్ లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. కాగా.. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగా లను మోహరించింది. ఏపీలో చోటు చేసుకున్న పోస్టు పోల్ అనంత‌ర హింస నేప‌థ్యంలో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గకుండా కూడా చ‌ర్య‌లు తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. ఈ పోలింగ్‌కు, ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన నాలుగు ద‌శ‌ల పోలింగ్‌కు తేడా ఉంది. ఇప్పుడు జ‌ర‌గ‌ను న్న ఐదో ద‌శ పోలింగ్‌… గాంధీల కుటుంబానికి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. రాయ్‌బ‌రేలి నుంచి రాహుల్‌గాంధీ పోటీ చేస్తున్నారు. ఇక్క‌డ నుంచి వ‌రుస విజ‌యాలుద క్కించుకున్న సోనియాగాంధీ ఈసారి త‌ప్పుకోవ‌డంతోఆయ‌న పోటీలో ఉన్నారు. కానీ, రాహుల్‌ను ఇక్క‌డ ఓడించాల‌ని బీజేపీ కంక‌ణం క‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ ఎత్తుగ‌డ‌ల‌ను ఎలా ఎదుర్కొంటార‌నేది ఉత్కంఠ‌గా మారింది.

ఇక‌, కీల‌క‌మైన అమేధీ నియోజ‌క‌వ‌ర్గంలో రాహుల్ గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఈ సారి ఈ స్థానంనుంచి అస‌లు ఆయ‌న పోటీలోనే లేరు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ కీల‌క‌మైన శ‌ర్మ‌ను బ‌రిలో దింపింది. అయినా.. ఇక్క‌డ గెలుస్తార‌నే ఆశ‌లు త‌క్కువ‌గా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఏమేర‌కు ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ గాంధీల ప‌రువు ద‌క్కించుకుంటుంద‌నేది దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది.