తేనెతుట్టెను గెలుకుతున్న రేవంత్ !

లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే తెలంగాణలో ఉన్న 33 జిల్లాలను 17 జిల్లాలకు కుదిస్తారని వస్తున్న వార్తలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా విభజించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని చోట్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను నిర్మించి ప్రారంభించింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని కుదిస్తామని ప్రకటించడం కొత్త పంచాయతీలకు తెరలేపడమే అని భావిస్తున్నారు.

17 పార్లమెంటు స్థానాలకు గాను 17 జిల్లాలుగా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారని, ఈ మేరకు జ్యుడిషియల్ కమీషన్ ఏర్పాటు చేయాలని భావించడం అనవసర రచ్చకు దారి తీస్తుందని అంటున్నారు. ఇప్పటికే టీఎస్ స్థానంలో టీజీ అని మార్చడం, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చడం, తెలంగాణ ప్రభుత్వ సింబల్ లో కాకతీయ తోరణం రాచరిక చిహ్నంగా ఉందని తొలగిస్తామనడం విమర్శలకు దారితీసింది. ప్రభుత్వం అవసరంలేని విషయాలలో వేలు పెట్టి వివాదాలలో చిక్కుకుంటుందని భావిస్తున్నారు.

పార్లమెంటు స్థానాల వారీగా జిల్లాలు అంటున్న నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలో నాగర్ కర్నూలు, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలు ఉన్నాయి. మహబూబ్ నగర్ పరిధిలో మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలు ఉన్నాయి. ఈ అయిదు జిల్లాలలో కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు నిర్మాణం పూర్తయి పరిపాలన కూడా సాగుతుంది. ఇక్కడ అయిదు జిల్లాలను రెండు జిల్లాలకు కుదిస్తే సొంత జిల్లాలోనే రేవంత్ తీవ్ర తిరుగుబాటు ఎదుర్కొనక తప్పే పరిస్థితి లేదు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలుగా విభజించారు. ఇప్పుడు అక్కడ కుదిస్తే జాబితా నుండి సూర్యాపేట జిల్లా ఎగిరిపోతుంది. ఇక పారిశ్రామికంగా అభివృద్ది చెందిన మిర్యాలగూడను జిల్లాగా చేయాలన్న డిమాండ్ ఉంది. వీలయితే అక్కడ మిర్యాలగూడను జిల్లా చేస్తే అభ్యంతరాలు ఉండవు. కానీ ఉన్న జిల్లాలలో వేలు పెడితే ప్రతిఘటన తప్పదు.

వరంగల్ జిల్లాను వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, హన్మకొండ, మహబూబా బాద్, ములుగు జిల్లాలుగా ఏర్పాటు చేశారు. ఇక్కడ వేలుపెడితే ఆరు జిల్లాలకు రెండే జిల్లాలు మిగులుతాయి. కరీంనగర్ జిల్లాను పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలుగా విభజించారు. ఇక్కడ వేలు పెడితే రెండు జిల్లాలు ఎగిరిపోతాయి. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అంటూ ప్రభుత్వం అనవసరంగా తేనెతుట్టెను గెలుకుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.