నారా లోకేష్‌పై మంగ‌ళ‌గిరి టాక్ విన్నారా?

టీడీపీ యువ‌నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక్క‌డ నుంచి ఆయ‌న పోటీ చేయ‌డం ఇది రెండో సారి. గత‌ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. కానీ, ఇప్పుడు గెలిచి తీరాల‌నే క‌సితో ఉన్నారు. గ‌త నాలుగేళ్లుగా నియోజ‌క‌వ‌ర్గంతో అనుబంధం పెంచుకున్నారు. ప్ర‌చారాన్ని ప‌రుగులు పెట్టించారు. పేద‌ల‌ను ఆదుకున్నారు. బండ్లు కొనిచ్చారు. చేనేత‌ల‌కు హామీ కూడా ఇచ్చారు. ప్ర‌త్యేకంగా మంగ‌ళ‌గిరికి 20 హామీలు గుప్పించారు.

తాను ఎమ్మెల్యే అయ్యాక‌.. ఇవి నెరవేరుస్తానంటూ.. ఆయ‌న ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకున్నారు. ఫ‌లితంగా నారా లోకేష్ పేరు ఇప్పుడు మార్మోగుతోంది. ఇక్క‌డ ఎవ‌రిని ప‌ల‌క‌రించినా.. నారా లోకేష్ పేరు వినిపిస్తుండ‌డం అతిశ‌యోక్తి కాదు. నిజం. నారా లోకేష్ ఇచ్చిన భ‌రోసా ఇక్క‌డ బాగానే వ‌ర్క‌వుట్ అవుతోంది. ఆయ‌న ఇమేజ్ పెరిగింద‌నే చెప్పాలి. ప్ర‌చారంలోనూ ఆయ‌న వినూత్న పంథాను ఎంచుకున్నారు. సెక్టార్ల వారీగా నియోజ‌క‌వ‌ర్గాన్ని విభ‌జించారు.

దాని ప్రకారం.. ప్ర‌చారాన్ని తీవ్ర త‌రం చేశారు. పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గతి వారిని ఒక సెక్టార్‌గా చేసుకుని ఆది నుంచి వీరిపై క‌న్నేశారు. ఇక‌, రోడ్ల‌పై వ్యాపారాలు చేసుకునే వారికి ప్ర‌త్యేక సాయాలు చేశారు. అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేసి నిత్యం భోజ‌నాలు పెడుతున్నారు. ఇక‌, ఎగుమ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాలు ఉండే.. అపార్ట‌మెంట్ల‌లోనూ ఆయ‌న ప్ర‌చారం చేయ‌డం గ‌మ‌నార్హం. గ‌త రెండు వారాలు కూడా.. వ‌రుస పెట్టి అపార్ట్‌మెంట్ల‌లో ప్ర‌చారాన్ని పెంచారు.

ఇక‌, నారా లోకేష్ స‌తీమ‌ణి బ్రాహ్మ‌ణి కూడా.. ప్ర‌చారంలో ముందుకు సాగారు. గ‌తంలో మాదిరిగా ఎన్నిక‌ల‌కు నాలుగు రోజుల ముందు కాకుండా.. ఈ ద‌ఫా 20 రోజుల ముందే వ‌చ్చి.. ఇక్క‌డ ఉన్నారు. కూలీల నుంచి కార్మికుల వ‌ర‌కు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి నుంచి ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర‌కు కూడా.. పెద్ద ఎత్తున క‌లిశారు. త‌న భ‌ర్త‌ను గెలిపించాల‌ని కోరారు. మొత్తంగా చూస్తే.. మంగ‌ళ‌గిరిలో వైసీపీని ఎదిరించి గెల‌వాల‌న్న క‌సి క‌నిపించింది. ఇదే టాక్ స్థానికంగా వినిపిస్తోంది. ఆయ‌న గెలుపును రాసిపెట్టుకునే రీతిలో ఇక్క‌డ ప‌రిస్థితి ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.