అన్న‌కు షాకిచ్చి.. చెల్లికి జై కొట్టి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పీసీసీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల దూసుకెళ్తున్నారు. క‌డ‌ప‌లో ప‌ర్య‌టిస్తూ స‌భ‌లో ప్ర‌సంగిస్తూ ప‌దునైన మాట‌ల‌తో సాగిపోతున్నారు. ఓ వైపు కాంగ్రెస్ పార్టీని తిరిగి ప్ర‌జ‌లకు చేరువ చేస్తూనే.. మ‌రోవైపు పార్టీ బ‌లాన్ని కూడా పెంచే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ముఖ్యంగా అన్న జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పార్టీ వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు, నాయ‌కులు కాంగ్రెస్‌లో చేరేలా ష‌ర్మిల ప‌టిష్ఠ‌మైన వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు వైసీపీ నుంచి టికెట్ ద‌క్క‌ని నేత‌లు.. ఇప్పుడు జ‌గ‌న్‌కు షాకిచ్చి చెల్లి ష‌ర్మిల చెంత‌కు వెళ్లిపోతున్నారు. తాజాగా పి.గ‌న్న‌వ‌రం వైసీపీ ఎమ్మెల్యే చిట్టిబాబు కూడా కాంగ్రెస్‌లో చేర‌డం హాట్ టాపిక్‌గా మారింది.

2019 ఎన్నిక‌ల్లో తూర్పు గోదావ‌రి జిల్లా పి.గ‌న్న‌వ‌రం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన చిట్టిబాబు విజ‌యం సాధించారు. ఈ సారి కూడా టికెట్ ఆశించారు. కానీ జ‌గ‌న్ ఆయ‌న‌కు మొండిచెయ్యే చూపించారు. అక్క‌డ సిటింగ్ ఎమ్మెల్యేను కాద‌ని విప్ప‌ర్తి వేణుగోపాల్‌కు జ‌గ‌న్ సీటు కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న చిట్టిబాబు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు. అనంత‌రం ష‌ర్మిల ఆయ‌న‌కు కాంగ్రెస్ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ నుంచి ఆయ‌న పి.గ‌న్న‌వ‌రంలో పోటీ చేసే అవ‌కాశ‌ముంది.

ఇప్ప‌టికే నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థ‌ర్‌, చింత‌ల‌పూడి ఎమ్మెల్యే ఉన్న‌మ‌ట్ల ఎలిజా కూడా వైసీపీ నుంచి కాంగ్రెస్‌లోకి జంప్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆర్థ‌ర్‌కు కాకుండా సుధీర్‌కు, ఎలిజాను కాద‌ని కుంభం విజ‌య‌రాజ‌కు జ‌గ‌న్ టికెట్లు కేటాయించారు. దీంతో టికెట్లు ద‌క్క‌ని వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. ఇప్ప‌టికే కొంత‌మంది టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన‌లోకి వెళ్లిపోగా.. మ‌రికొంద‌రు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. గ‌తంలో వైఎస్ కార‌ణంగా కాంగ్రెస్‌పై ఉన్న అభిమానం, వైఎస్ కుటుంబంతో స‌త్సంబంధాల కార‌ణంగా చాలా మంది జ‌గ‌న్‌కు వ‌దిలి ష‌ర్మిల వెంట న‌డిచేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని తెలిసింది. ఈ ఎన్నిక‌ల స‌మ‌యంలో మ‌రికొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలూ ష‌ర్మిల‌కు చెంత చేర‌తార‌ని టాక్‌.