“హ‌త్యా రాజ‌కీయాలు వ‌ద్దంటే.. జ‌గ‌న్‌ను చిత్తుగా ఓడించండి”

“హ‌త్యా రాజ‌కీయాలు వ‌ద్ద‌ని అనుకుంటే.. వైసీపీని, సీఎం జ‌గ‌న్‌ను చిత్తుగా ఓడించండి” – అని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ప్ర‌జ‌లకు పిలుపునిచ్చారు. తాజాగా ఆమె ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో గ‌డిచిన ఐదేళ్ల‌లో హ‌త్యా రాజ‌కీయాలు పెరిగిపోయాయన్నారు. ఈ హ‌త్యా రాజ‌కీయాల‌ను వైసీపీ పెంచి పోషించింద‌ని తెలిపారు. ముఖ్య‌మంత్రే హంత‌కుల‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తున్నార‌ని.. ఇలాంటి వారిని ఓడించేందుకు ప్ర‌తి ఒక్క‌రూ ముందుకు రావాల‌ని ష‌ర్మిల పిలుపునిచ్చారు.

“కడప లోక్ సభ ఎన్నికల్లో ఓ వైపు రాజశేఖరరెడ్డి బిడ్డ.. మరోవైపు వివేకాను హత్య చేయించిన అవినాశ్ రెడ్డి ఉన్నారు. హంతకులు చట్ట సభలకు వెళ్లకూడదనే నేను కడప ఎంపీగా పోటీ చేస్తున్నా. ధర్మం కోసం ఒకవైపు నేను… డబ్బుతో అధికారాన్ని కొందామనుకునే వ్యక్తి మరోవైపు ఉన్నారు. ఎవరిని గెలిపించాలనే దే ప్రజలే నిర్ణయించుకోవాలి” అని ష‌ర్మిల పిలుపునిచ్చారు.

సొంత చిన్నాన్న వివేకానంద‌రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి జగన్ మళ్లీ టికెట్ ఇచ్చారని ష‌ర్మిల దుయ్య‌బ‌ట్టారు. హంతకులను కాపాడేందుకే జగన్ సీఎం పదవిని వాడుకుంటున్నారని అన్నారు. హత్యా రాజకీయాలకు ముగింపు పలకాలంటే జగన్, అవినాశ్ ను ఓడించాలని అన్నారు. కడప జిల్లా కాశినాయన మండలం అమగంపల్లిలో ఆమె బస్సు యాత్రను ప్రారంభించారు.

వైఎస్ వారసుడు కాదు..

ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వైఎస్‌కు వార‌సుడు కానేకాడ‌ని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎన్నో అద్భుత పథకాలను తీసుకొచ్చారని షర్మిల అన్నారు. మ‌రి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పిన జగన్… అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టారని అలాంట‌ప్పుడు వైఎస్‌కు ఆయ‌న వార‌సుడు ఎలా అవుతాడ‌ని ప్ర‌శ్నించారు. హోదా వచ్చి ఉంటే రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వచ్చి ఉండేవని చెప్పారు.