జంపింగుల వ్యూహం స‌క్సెస్ అయితే.. క‌ష్ట‌మే!

ఎన్నిక‌ల‌కు ముందు స‌హ‌జంగానే అసంతృప్తులు జంప్ చేయ‌డం..త‌మ‌కు న‌చ్చిన పార్టీల్లో చేర‌డం సాధారణంగా జ‌రిగేదే. ఏదో టికెట్ల‌పై ఆశ‌తో ఉన్న‌వారికి టికెట్లు రాక‌పోతే.. పార్టీని వీడ‌డం స‌హ‌జంగానే జ‌రుగు తుంది. దీనిని ఎవ‌రైనా అర్థం చేసుకుంటారు. అయితే.. వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన నాయ‌కుల ప‌రిస్థితి వేరేగా ఉంది. వీరిని ఐదేళ్లు ప‌నిచేయించుకుని.. వాడేసుకుని.. తీరా ఎన్నిక‌ల‌కు ముందు చేయివ్వడంతో వారంతా.. మాన‌సికంగా ర‌గిలిపోతున్నార‌నేది వాస్త‌వం.

ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, అద్దంకి వైసీపీ నేతలు బాచిన కృష్ణచైతన్య, గరటయ్య, కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాలరెడ్డి, జంగా కృష్ణమూర్తి యాదవ్‌(బీసీ) వంటివారు తాజాగా టీడీపీలో చేరారు. మూకుమ్మ‌డిగా ఒక‌వైపు వైసీపీ అభ్య‌ర్థుల జాబితా ప్ర‌క‌ట‌న కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే వీరు చంద్ర‌బాబు ఇంటి వ‌ద్ద క్యూ క‌ట్టారు. వీరంతా.. టికెట్ రాని బాధితులు అనేది మాత్ర‌మే కాదు.. అంత‌కు మించి మాన‌సికంగా ఆవేద‌న చెందిన నాయ‌కులు కూడా. వీరిని చంద్ర‌బాబు సాద‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఎందుకంటే.. వైసీపీలో ఐదేళ్లుగా ప‌నిచేసి, పార్టీ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డిన వారిలో జంగా ఒక‌రు. ఇక‌, బాచిన కుటుంబం అయితే.. ఓడిపోయినా పార్టీలోనే ఉండి సేవ చేసింది. ఒకానొక సంద‌ర్భంలో ప్ర‌త్య‌ర్థుల నుంచి తీవ్ర ఎదురుగాలి వీచినా.. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ముందుకు తీసుకువెళ్లారు. ఇలాంటి వారికి కూడా సీఎం జ‌గ‌న్ క‌నీసం అప్పాయింట్‌మెంటు ఇవ్వ‌లేదు. టికెట్ మాట అటుంచితే.. మ‌న‌సును చ‌ల్ల‌బ‌రిచేలా కూడా వ్య‌వ‌హ‌రించ‌లేదు. ఇది వారిని తీవ్రంగా వేధిస్తోంది. అందుకే వీరిలో వైసీపీపై క‌సి భారీ ఎత్తున పెరిగిపోయింది.

ఈ జంపింగుల నోటి నుంచి వ‌చ్చిన ఒకే ఒక కామ‌న్‌ డైలాగ్‌.. ‘వైసీపీలో ఇమడలేక టీడీపీలో చేరాం. సొంత కుటుంబానికి తిరిగి వచ్చినట్లయింది. నమ్మించి మోసం చేయడంలో వైసీపీ నేతలు ముందు వరుసలో ఉన్నారు. సీటు ఇస్తామని నమ్మించి చివరకు వారి కులానికి, వారికి న‌చ్చిన వారికి ఇచ్చారు. ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. విలువ లేకుండా చూస్తున్నారు. షరతులు లేకుండానే టీడీపీలో చేరాం’ అనే. దీంతో వీరంతా వైసీపీకి సెగ పెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.