కేసీయార్ రాజకీయ పయనమెటు.?

అయిపోయింది.. అంతా అయిపోయింది.! ఔను, ‘తెలంగాణ జాతి పిత’ అన్న ట్యాగ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముందర ఇకపై వుండకపోవచ్చు.! తెలంగాణ రాజకీయ తెరపైనుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ఏనాడో కనుమరుగైపోయింది. ఇప్పుడున్నది భారత్ రాష్ట్ర సమితి. ఎప్పుడైతే, పార్టీ పేరు నుంచి ‘తెలంగాణ’ని తొలగించేశారో, అప్పుడే ఖేల్ ఖతం అయిపోయింది.!

ఒకరొకరుగా భారత్ రాష్ట్ర సమితిని వీడుతున్నారు. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి టిక్కెట్లు దక్కించుకున్న అభ్యర్థులూ పార్టీని వీడుతుండడం గమనార్హం. అసలంటూ భారత్ రాష్ట్ర సమితిలో మెజార్టీ ‘వలస నేతలే’. ఎలా వలస వచ్చారో, అలా వలస వెళ్ళిపోతున్నారు. దాంతో, భారత్ రాష్ట్ర సమితి, శరవేగంగా ఖాళీ అయిపోతోంది.

కేశవరావు, కడియం శ్రీహరి.. చెప్పుకుంటూ పోతే, ఈ లిస్టు చాంతాడంత. చివరికి భారత్ రాష్ట్ర సమితిలో ఎవరు మిగులుతారు.? హరీష్ రావు వుంటారా.? ఆయనా పార్టీ మారతారా.? ఇలా చాలా అనుమానాలు. అసలంటూ తొలి వికెట్టే హరీష్ రావుది అయి వుండాలన్న ప్రచారం గతంలో జరిగింది.

కాంగ్రెస్ పార్టీలోకీ, భారతీయ జనతా పార్టీలోకీ.. బీఆర్ఎస్ నేతలు వలస వెళుతున్నారు. ‘వెళుతున్నవారిని ఆపబోం.. అలాంటివారిని మళ్ళీ తిరిగి పార్టీలోకి రానివ్వం..’ అని బీఆర్ఎస్ చెబుతోంది. కానీ, ఇదే బీఆర్ఎస్.. గతంలో పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించింది. కేసీయార్ ఎలాగైతే వలసల్ని ప్రోత్సహించారో, ఇప్పుడు అధికారంలో వున్న రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నారు.

నువ్వు చేసింది తప్పు.. అని కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ విమర్శలు చేయడానికి వీల్లేని పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వంద రోజుల్లోనే బీఆర్ఎస్ ఇంతలా ఖాళీ అయిపోయిందంటే, లోక్ సభ ఎన్నికల తర్వాత అసలంటూ బీఆర్ఎస్ పార్టీ వుంటుందా.? వుండదా.?

ఇంతకీ, కేసీయార్ రాజకీయ పయనమెటు.? విలీనం దిశగా కేసీయార్ అడుగులేస్తారా.? మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని పునర్నిర్మిస్తారా.? ఇప్పుడున్న పరిస్థితుల్లో పునర్నిర్మాణం దాదాపు అసాధ్యం.. కేసీయార్‌కి విలీనమే శరణం.!