ఎంత క‌ష్ట‌మొచ్చింది సాయిరెడ్డీ!

నాయ‌కులు ఎంత బ‌లవంతులైనా.. ప్ర‌జాబ‌లం లేక‌పోతే.. ప్ర‌జ‌లు స‌మ‌ర్థించ‌క‌పోతే.. ఒట్టిపోతారు. అభాసు పాల‌వుతారు. న‌లుగురు న‌వ్వేలా కూడా అయిపోతారు. ఇప్పుడు నెల్లూరు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ టికెట్‌పై బ‌రిలో ఉన్న రాజ్య‌స‌భ స‌భ్యుడు, వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వేణుంబాకం విజ‌య‌సాయిరెడ్డి ప‌రిస్థితి ఇలానే ఏర్ప‌డింది. తాజాగా ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించారు. ఈ క్ర‌మంలో నెల్లూరులోని ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న ప్ర‌చార ర‌థం ఎక్కి.. త‌న‌కు ఓట్లు వేయాల‌ని అభ్య‌ర్థించబోయారు.

కానీ, ఇక్క‌డే ప్ర‌జ‌ల నుంచి ఘోర అవ‌మానం ఎదురైంది. ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా సాయిరెడ్డి చేసే ప్ర‌సంగం కోసం ఎద‌రు చూడ‌లేదు. అస‌లు ఆగ‌ను కూడా ఆగ‌లేదు. అంతేకాదు.. “మ‌న నాయ‌కుడు మాట్లాడుతున్నారు.. పెద్దాయ‌న మాట్లాడుతున్నారు. ఆగండి” అంటూ.. ప్ర‌చార ర‌థంపై నుంచి ద్వితీయ శ్రేణి నాయ‌కు లు మైకుల్లో బిగ్గ‌ర‌గా అరిచినా.. ప్ర‌యోజ‌నం క‌నిపించ‌లేదు. వ‌చ్చిన వారు వెళ్ల‌డ‌మే త‌ప్ప‌.. వెనుదిరిగి చూసిన వారు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. సాధార‌ణ జ‌నాలు ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా వెన‌క్కి అడుగు తిప్ప‌లేదు.

పోనీ.. సాధార‌ణ జ‌నాల మాట ఎలా ఉన్నా.. వైసీపీ కార్య‌క‌ర్త‌లైనా ఉన్నారా? అంటే.. వారు కూడా ప‌లాయ నం బాటే ప‌ట్టారు. చివ‌రాఖ‌రుకు.. భోజ‌నాలు సిద్ధంగా ఉన్నాయ‌ని.. ప‌దే ప‌దే మైకుల్లో గ‌గ్గోలు పెట్టారు. అయినా కూడా ఎవ‌రూ వెన‌క్కి రాలేదు. “క‌నీసం వెన‌క్కి ర‌మ్మ‌ని బ్ర‌తిమాలుకున్నందుకైనా వెన‌క్కి రావాలి.. అమ్మా.. అమ్మా.. ఒక్క‌సారి వెన‌క్కి చూడండి” అని వేడుకున్నా.. ఎవ‌రూ వెన‌క్కి కూడా చూడ‌లేదు. క‌నీసం ఆగ‌లేదు. దీంతో సాయిరెడ్డి ముఖం బాధాత‌ప్త‌మైంది. చేతిలో ఏవో పేప‌ర్లు ప‌ట్టుకుని ఏదో మాట్లాడాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నం చేసినా.. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.

ఏం జ‌రిగింది?

సాయిరెడ్డి పాల్గొన్న స‌భ‌లో ఇలా జ‌నాలు వెనుదిరిగిపోవ‌డంపై వైసీపీలోనూ ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే.. దీనికి ప్ర‌ధానంగా ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌తేనా కార‌ణం? అనేది ఒక‌టైతే.. మ‌రోవైపు స‌మ‌యానికి యాత్ర త‌మ నియోజ‌క‌వ‌ర్గానికి రాక‌పోవ‌డం.. పైన ఎండ ఠారెత్తి పోతుండ‌డంతో జ‌నాలు నిల‌వ‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని వైసీపీనాయ‌కులు అంటున్నారు. ఇక‌, ఉద‌య‌గిరి ప్ర‌జ‌ల‌కు సాయిరెడ్డి ఎవ‌రో తెలియ‌క‌పోవ‌డం.. ఆయ‌న ప్ర‌జాక్షేత్రంలో తొలి సారి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుండ‌డం కూడా ఆయ‌న ప్ర‌సంగాల‌కు ప్ర‌జ‌లు వెయిట్ చేయ‌లేద‌నే వాద‌న వినిపిస్తోంది. ఏదేమైనా.. వైసీపీ  కీల‌క నేత యాత్ర‌లో ఇంత ఘోర అవ‌మానం ఎదుర‌వడం గ‌మ‌నార్హం.