ఎల‌క్టోర‌ల్ బాండ్స్‌… ప్రపంచంలో అతి పెద్ద కుంభ‌కోణం

ఎల‌క్టోర‌ల్ బాండ్స్‌… ప్రపంచంలో అతి పెద్ద కుంభ‌కోణం- అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారా మన్ భ‌ర్త.. ప్ర‌ముఖ విశ్లేష‌కుడు పర‌కాల ప్ర‌భాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు.. ఇవి పార్లమెం టు ఎన్నిక‌ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతాయ‌ని అన్నారు. ఓట్ల‌ను కొనేందుకు, అభ్య‌ర్థుల‌ను తారు మారు చేసేందుకు ఈ నిధులు దోహ‌ద ప‌డ‌తాయ‌ని ప్ర‌భాక‌ర్ వ్యాఖ్యానించారు. ఇక‌, ఇప్ప‌టికే దేశంలో ఎల‌క్టోర‌ల్ బాండ్స్ వ్య‌వ‌హారం.. సంచ‌ల‌నం రేపుతున్న విష‌యం తెలిసిందే.

2019లో మోడీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత తీసుకువ‌చ్చిన ఎల‌క్టోర‌ల్ బాండ్స్ ద్వారా.. ఎవ‌రైనా స‌రే.. త‌మ పేరును వెల్ల‌డించ‌కుండా.. పార్టీల‌కు విరాళాలు ఇవ్వొచ్చు. ఇదే  ఇప్పుడు జాతీయ స్థాయిలో చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఈ విష‌యాన్ని కార్న‌ర్ చేసుకుని..  పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా దుమారం రేపుతున్నాయి.  ఇది ప్రపంచంలోనే ఇది అతి పెద్ద కుంభకోణమని చెప్పారు.

అంతేకాదు.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీపై గణనీయమైన ప్రభావాలను చూపే అవకాశం ఉందన్నారు. ఎల క్టోరల్ బాండ్స్ ఇష్యూ రోజురోజుకూ పెరుగుతోందని… అదొక కుంభకోణమనే సంగతి ఇప్పుడు అందరికీ అర్థమవుతోందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ ఇష్యూ పెద్ద సమస్యగా మారుతుందని ప్ర‌భాక‌ర్ చెప్పారు. ఇది రాజ‌కీయ దుమారం క‌న్నా.. కూడా.. ఓట‌ర్ల దుమారంగా మారే అవ‌కాశం ఉంద‌న్నారు.

ఎట్ట‌కేల‌కు గుట్టు ర‌ట్టు!

ఎల‌క్టోర‌ల్ బాండ్స్‌ను జాతీయ బ్యాంకైన ఎస్‌బీఐ సేక‌రించింది.(విక్ర‌యించింది) అయితే..ఇది అత్యంత గోప్యంగా ఉంచారు కానీ, మ‌హిళా జ‌ర్న‌లిస్టు వేసిన పిటిష‌న్‌తో క‌దిలిన ఈ వ్య‌వ‌హారం సుప్రీంకోర్టు సీరియ‌స్ అయ్యే వ‌ర‌కు సాగింది. ఎట్ట‌కేల‌కు.. అతి క‌ష్టం మీద ఈగుట్టును ఎస్‌బీఐ బ‌య‌ట పెట్టింది. అంతేకాదు.. ఎవ‌రెవ‌రు ఏయే పార్టీల‌కు ఎంతెంత ఇచ్చార‌నే విష‌యం కూడా వెలుగు చూసింది. బీజేపీలో ఉండి కాంగ్రెస్‌కు, కాంగ్రెస్‌లో ఉండి బీజేపీకి.. వైసీపీలో ఉండి టీడీపీకి విరాళాలు ఇచ్చిన నాయ‌కులు కూడా ఉన్నారు.

ఇవీ పార్టీలకు అందిన విరాళాలు

బీజేపీ- రూ. 6,986.5 కోట్లు
టీఎంసీ- రూ. 1,397 కోట్లు
కాంగ్రెస్ – రూ. 1,334 కోట్లు
బీఆర్ఎస్ – రూ. 1,322 కోట్లు
వైసీపీ – రూ.1250 కోట్లు
టీడీపీ – రూ. 850 కోట్లు