చిన్న‌మ్మ‌కు సెగ‌.. కీల‌క స‌మావేశానికి సీనియ‌ర్లు డుమ్మా!

కీల‌క‌మైన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో బీజేపీ.. టీడీపీ-జ‌న‌సేన‌తో పొత్తులు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో బీజేపీని ఏపీలో ప‌రుగులు పెట్టించ‌డ‌మో.. క‌నీసం నాలుగు పార్ల‌మెంటు, 6 అసెంబ్లీ స్థానాల్లో విజ‌యం ద‌క్కేలా వ్యూహాత్మ‌కంగా ముందుకు తీసుకువెళ్ల‌డ‌మో చేయాల‌ని బీజేపీ ఏపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి భావించారు. ఇది చిన్నమ్మ రాజ‌కీయ జీవితంలోనే అతి పెద్ద ప‌రీక్ష‌. రెండు కీల‌క పార్టీల‌తో పొత్తులు పెట్టుకున్న త‌ర్వాత కూడా బీజేపీ ముందుకు సాగ‌క‌పోతో అది ఆమె రాజ‌కీయ నాయ‌క‌త్వంపై ప్ర‌భావం చూపించే అవ‌కాశం ఉంది.

ఈ నేప‌థ్యంలో అంద‌రినీ క‌లుపుకొని పోయేలా చిన్న‌మ్మ గ‌ట్టి ప్లానే వేశారు. ఇప్ప‌టికే దాదాపు సీట్లు ఖ‌రారైన నేప‌థ్యంలో పార్టీ శ్రేణుల‌ను ముందుకు న‌డిపించేందుకు ఆమె ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఈ క్ర‌మంలో తాజాగా విజ‌య‌వాడ‌లో బీజేపీ ప‌దాదికారుల స‌మావేశం ఏర్పాటు చేశారు. అంద‌రికీ ఆహ్వానాలు పంపించారు. దీనిలో పార్టీ ఎలా ముందుకు సాగాలి?  వ‌చ్చే ఎన్నిక‌ల్లో చేయాల్సిన ప్ర‌చారం..?  అధిష్టానం ఏం చెప్పింది? అనే అనేక విష‌యాల‌ను చ‌ర్చించాల‌ని భావించారు. కానీ, ఇక్క‌డే చిన్న‌మ్మ‌కు భారీ సెగ త‌గిలింది.

విజయవాడలో జరిగిన బీజేపీ పదాధికారుల సమావేశానికి సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు.  పార్టీని నమ్ముకున్న వారికి మేలు జరగడం లేదన్న అభిప్రాయంలో ఉన్నారు.  సాధారణంగా పొత్తుల్లో పరిమితంగా పోటీ  చేయాల్సి వచ్చినప్పుడు… పార్టీ సీనియర్ నేతలకు ప్రాధాన్యమిస్తారు. లేకపోతే క్యాడర్ లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. బీజేపీలో ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏర్ప‌డింది. కొత్తగా వచ్చిన వారికే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు. ఇలా ఎందుకు ఇస్తున్నారో  పార్టీ నేతలకూ అర్థం కావడం లేదు.  దీంతో సీనియ‌ర్లు తాజాగా చిన్న‌మ్మ పెట్టిన కీల‌క స‌మావేశానికి డుమ్మా కొట్టి.. పోన్లు కూడా స్విచ్ఛాఫ్ చేసుకున్నారు.

బీజేపీ కోసం ప్రాణం పెట్టే సీనియర్లు అంతా మౌనం పాటిస్తున్నారు. వారికి ఏ విషయంలోనూ పార్టీ వ్యవహారాల్లో తగినంత ప్రాధాన్యం లభించడం లేదు.  పార్టీ విజయం కోసం వారికి సరైన బాధ్యతలు ఇవ్వడానికి కూడా వెనుకాడుతున్న  పరిస్థితులు కనిపిస్తున్నాయి. గౌరవం కాపాడుకోవడానికి అయినా మౌనంగా ఉండటం ఉత్తమం అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.  బీజేపీలో ఈ పరిస్థితిని సీనియర్లు లేఖ ద్వారా  హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది.. అందుకే కీలక సమావేశాలకు వారు దూర‌మ‌య్యార‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.