ఆ 100 కోట్లు ఎక్క‌డివి? క‌విత‌కు తొలి రోజే ఉక్కిరిబిక్కిరి

ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో నిందితురాలిగా ఉన్న బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె క‌విత ప్ర‌స్తుతం ఈడీ క‌స్ట‌డీలో ఉన్న విష‌యం తెలిసిందే. శుక్ర‌వారం సాయంత్రం ఆమెను హైద‌రాబాద్‌లోని స్వ‌గృహం నుంచి అధికారులు అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకువెళ్లారు. అనంత‌రం.. శ‌నివారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్ర‌వేశ పెట్టి అనంత‌రం.. త‌మ క‌స్ట‌డీకి తీసుకున్నారు. కోర్టు కూడా ఏకంగా ఏడు రోజుల పాటు క‌విత‌ను ఈడీ క‌స్ట‌డీకి అప్ప‌గించింది. ఈ క్ర‌మంలో ఆదివారం తొలిరోజు.. ఈడీ అధికారులు క‌విత‌ను ప్ర‌శ్నించారు. అయితే.. తొలిరోజే ఆమెపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన‌ట్టు తెలిసింది. దీంతో క‌విత ఉక్కిరిబిక్కిరికి గుర‌య్యార‌ని స‌మాచారం.

విచారణ ప్రక్రియను ఈడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. ఆప్ కు ఇచ్చిన రూ. 100 కోట్ల ముడుపులు ఎక్కడి నుంచి వచ్చాయనే క‌విత‌ను ప్ర‌ధానంగా అడిగిన ప్ర‌శ్న‌గా తెలిసింది. అస‌లు కేసంతా కూడా ఈ 100 కోట్ల చుట్టూనే తిరుగుతున్న విష‌యం తెలిసిందే. అంతేకాదు, ఎవరెవరు డబ్బులు సమకూర్చారనే ఆధారాలను కూడా చూపిస్తూ ఆమెను ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ ద్వారా సంపాదించిన రూ. 192 కోట్ల సంగతి ఏమిటని అడిగారు. డబ్బులు ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారని ప్రశ్నించారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానాలు చెప్పిన కవిత… మరి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారని తెలిసింది.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈడీ అధికారులు పలు అంశాలపై కవితను ప్రశ్నించారు. కవిత కొనుగోలు చేసిన ఆస్తుల పత్రాలను చూపించి ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. తొలిరోజు విచారణ ముగిసిన అనంతరం ఎమ్మెల్సీ కవితను ఆమె భర్త అనిల్‌తో పాటు సోదరుడు కేటీఆర్, హరీష్ రావు కలుసుకుని పరామర్శించారు. విచారణకు సంబంధించిన విషయాలు, కేసు అంశంతో పాటు తాము ఏం చేయాలని చర్చించారు. ఈడీ అధికారులు కవితను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆమె భర్త అనిల్ అనిల్‌ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.