టికెట్లు క‌న్ఫ‌ర్మ్ అయినా.. ప్ర‌చారం ఏదీ?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు 94 మందితో తొలి జాబితా ఇచ్చేశారు. మ‌రో 34 మందితో మ‌లి జాబితా కూడా విడుద‌ల చేశారు. ఇక‌, మిగిలిన స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాల్సి ఉంది. మ‌రి ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన 94 మందితో కూడిన జాబితాకు దాదాపు 25 రోజులు అయిపోయింది. మ‌రి ఈ 94 మందిలో చంద్ర‌బాబు, నారా లోకేష్‌, బాల‌య్య‌ల‌ను ప‌క్క‌న పెడితే.. 91 మందిలో ఎంత మంది ప్ర‌చారం ప్రారంభించారు.. అంటే.. వేళ్ల మీదే లెక్కించుకోవాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ఎక్క‌డా ఆ ఊపు క‌నిపించ‌డం లేదు. దీనికి ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయి. చాలా నియోజక‌వ‌ర్గాల్లో ఒక‌త్త వారికి అవ‌కాశం ఇవ్వ‌డంతో వారు స్థానిక నేత‌లను మ‌చ్చిక చేసుకునేందుకే స‌మ‌యం స‌రిపోవ‌డం లేదు. దీనికితోడు టికెట్ రాని నాయ‌కులు .. కొత్త‌వారిని దూరంగా ఉంచుతున్నారు. కనీసం ఫోన్ల‌కు కూడా స్పందించ‌డం లేద‌ని తెలిసింది. దీంతో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంకా ప్ర‌చార ప‌ర్వం ప్రారంభం కాలేదు. పైగా కొత్త‌వారు త‌మ‌ను తాము నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేసుకోవ‌డం కూడా క‌ష్టంగా మారింది.

ఇదిలావుంటే.. బీజేపీ, జనసేన‌తో టీడీపీ జ‌ట్టుకట్టింది. అయితే.. ఈ రెండు పార్టీల నాయ‌కులు కూడా టీడీపీతో క‌లిసిరావ‌డం లేదు. కొంద‌రు అభ్య‌ర్థులు చేస్తున్న ప్ర‌చారంలో కేవ‌లం టీడీపీ జెండాలు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌లో టీడీపీ నాయ‌కుడు బొండా ఉమా పోటీ చేస్తున్నారు. ఈయ‌న ఇంకా ప్ర‌చారం ప్రారంభించ‌లేదు. కానీ, నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా మాత్రం బ్యాన‌ర్లు క‌ట్టించుకున్నారు. కానీ, ఎక్క‌డా బీజేపీ ఫేస్ లేదు. జ‌న‌సేన ఫేస్ కూడా క‌నిపించ‌డంలేదు.

అంటే.. ఈ రెండు పార్టీల‌ను ఆయ‌న క‌లుపుకొని పోయేందుకు సిద్ధంగా లేర‌నే వాద‌న వినిపిస్తోంది. ఇలాంటి ప‌రిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉంది. మ‌రికొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీకి, జ‌న‌సేనకు కూడా కేడ‌ర్ లేదు. ఇలాంటి చోట కూడా.. ఆ రెండు పార్టీల ప్ర‌స్తావ‌న లేకుండా పోయింది. అంతో ఇంతో ఈ రెండు పార్టీలు బ‌లంగా ఉన్నాయ‌ని అనుకుంటే.. ఈ రెండు పార్టీల నుంచి కూడా అభ్య‌ర్థులు పోటీ కి సై అంటున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేత‌ల‌ప్ర‌చారం కేవ‌లం 10 నుంచి 20 నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే ప్రారంభం కావ‌డం గ‌మ‌నార్హం.