ఆ సీట్ల‌పై కొన‌సాగుతున్న స‌స్పెన్స్‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు తాజాగా ప్ర‌క‌టించిన రెండో అభ్య‌ర్థుల జాబితాలో 34 స్థానాల‌ను ప్ర‌క‌టించారు. వీటిలో కొన్ని స్థానాలు.. కొన్నాళ్లుగా వివాదంలో ఉన్న‌వే. అయితే, వాటికి ప‌రిష్కారం చూపించారు. ఉదాహ‌ర‌ణ‌కు ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం గోపాల‌పురంలో యువ నాయుకుడు, మాదిగ వ‌ర్గానికి చెందిన మ‌ద్దిపాటి వెంక‌ట రాజును ఇంచార్జ్‌గా నియ‌మించారు. కానీ, ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంక‌టేశ్వ‌ర‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

త‌న‌కే టికెట్ కావాల‌ని డిమాండ్ చేశారు. మ‌ద్దిపాటికి వ్య‌తిరేకంగా లేఖ‌లు కూడా సంధించారు. అయితే.. ఈ వివాదం కొన‌సాగుతున్న స‌మయంలో చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా ఇద్ద‌రికీ టికెట్లు ఇచ్చారు. వీరిద్ద‌రూ బ‌ల‌మైన నేత‌లే కావ‌డంతో ఇద్ద‌రినీ వ‌దులుకోవ‌డం ఇష్టం లేక‌.. చంద్ర‌బాబు చాలా చ‌క్క‌ని ప‌రిష్కారం చూపించారు. మాల సామాజిక వ‌ర్గం కోరుకుంటున్న కొవ్వురుకు ముప్పిడి వెంక‌టేశ్వ‌ర‌రావును పంపించి.. గోపాల‌పురం టికెట్ ను మ‌ద్దిపాటికే ఇచ్చారు. దీంతో స‌మ‌స్య సుఖాంతం అయింది.

అయితే.. ఇదే స‌య‌మంలో ఉమ్మ‌డి కృష్ణాలోని కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంకా స‌స్పెన్స్‌ను కొన‌సాగి స్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు మైల‌వ‌రం టికెట్‌ను ఎవ‌రికి ఇస్తార‌నే చ‌ర్చ రెండు మూడు మాసాలుగా పార్టీలోనూ రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ జోరుగా సాగుతోంది. ఇక్క‌డ మాజీ మంత్రి పార్టీ కీల‌క నేత దేవినేని ఉమా టికెట్ ఆశిస్తున్నారు. కానీ, వైసీపీ నుంచి గెలిచిన వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ ఇటీవ‌ల పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మ‌రి ఈయ‌న‌కు టికెట్ ఇస్తార‌నే చ‌ర్చ సాగుతోంది. దీనికి ఈ జాబితాలో ప్రాధాన్యం ఇవ్వ‌లేదు.

ఇదే జిల్లాలోని మ‌రో నియోజ‌క‌వ‌ర్గం పెన‌మ‌లూరు. ఇక్క‌డ టికెట్ ఆశిస్తున్న బోడే ప్ర‌సాద్కు చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. ఆయ‌న వెయ్యిక‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. టికెట్ ఇవ్వ‌క‌పోతే.. జంప్ చేసి వైసీపీలో చేరేందుకు కూడా రెడీ అయిపోయారు. బ‌హుశ అందుకే చంద్ర‌బాబు ఆ చాన్స్ ఇవ్వ‌కుండా ఉండేందుకే.. ఇక్క‌డ టికెట్‌ను కూడా పెండింగులో పెట్టారు. ఇలా మొత్తం 16 సీట్ల‌లో ఏమీతేల్చ క‌పోవ‌డం గ‌మ‌నార్హం.