కొత్త రెవెన్యూ చట్టం…అంతం కాదు ఆరంభం: కేసీఆర్

తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సవరణలు లేకుండానే బిల్లుకు సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ సవరణలను ఉపసంహరించుకున్నారు. ఈ సందర్భంగా కొత్త రెవెన్యూ చట్టంపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త రెవెన్యూ చట్టం అనేది అంతం కాదని ఆరంభం మాత్రమేనని అన్నారు. రెవెన్యూ చట్టంలో ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలను మాత్రమే తొలగిస్తున్నామన్నారు.

వీఆర్వో వ్యవస్థ రద్దుతో ప్రజలు సంబురాలు చేసుకున్నారని కేసీఆర్ తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ధరణి పోర్టల్‌ నిర్వహిస్తామని, ధరణిలో డేటా పూర్తి సేఫ్‌గా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చిన కేసీఆర్…మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. శనివారం నుంచి తెలంగాణలో దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్స్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దేవాదాయ, వక్ఫ్ భూములు క్రయ, విక్రయాలు రద్దు చేస్తున్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు. వక్ఫ్‌ భూముల్లో లావాదేవీలను ఆటోలాక్ చేసి సర్వే జరిగిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

తెలంగాణలో పోడు భూముల సమస్యకు ముగింపు పలకాలని, పోడు భూముల రైతులకు రక్షణ కల్పిస్తామని కేసీఆర్ అన్నారు. 6.18 లక్షల ఎకరాలను క్రమబద్దీకరించి జీవో 58,59 కింద 1,40,328 మంది పేదలకు పట్టాలు ఇచ్చామని, పేదలను కాపాడటంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాయని కేసీఆర్‌ తెలిపారు.

గ్రీన్‌జోన్లను ప్రకటించి అందులో నిర్మాణాలు జరగకుండా చూస్తామని, బీఆర్‌ఎస్‌ అంశం హైకోర్టు పరిధిలో ఉందని చెప్పారు. అసైన్డ్‌ భూములపై ఎస్పీ, ఎస్టీ ఎమ్మెల్యేలతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని, ఐఏఎస్‌ అధికారుల ఆధ్వర్యంలోనే ఫాస్ట్‌ట్రాక్‌ ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు. ప్రజలకు పంచడానికి ప్రభుత్వ భూములు లేవని, భూములు క్రమబద్దీకరణ చేసి అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు.

కేంద్రం తెచ్చిన విద్యుత్‌ సంస్కరణలు ప్రజా వ్యతిరేకం అని, జీడీపీ 24 శాతం మైనస్‌లో ఉందని కేంద్రంపై కేసీఆర్‌ విమర్శలు గుప్పించారు. కోటీ 45 లక్షల 58 వేల మంది రైతులకు రైతుబంధు అమలైందని, 57.95 లక్షల మంది రైతులకు రూ.7,279 కోట్లను అందించామని కేసీఆర్ చెప్పారు. వివాదాల్లో ఉన్న భూములు చాలా తక్కువ అని, ప్రతిచోట లిటిటేషన్లే ఉంటాయని అనుకోవడం సరికాదని అన్నారు.

మార్పును అంత సులభంగా ఎవరూ అంగీకరించరని, సమగ్ర సర్వేనే అన్ని సమస్యలకు పరిష్కారమని తెలిపారు. గత పాలకుల హయాంలో భూపంపిణీ శాస్త్రీయంగా జరగలేదని, అస్తవ్యస్థంగా జరిగిందని కేసీఆర్ దుయ్యబట్టారు. ఉన్నభూమి కన్నా ఎక్కువ స్థలానికి పట్టాలు పంపిణీ చేశారని అన్నారు. భూముల పంపకం రాజకీయ చర్యగా భావించినంత కాలం ఇలాంటి తప్పిదాలే జరుగుతుంటాయని, పేద కుటుంబానికి ఆర్థికంగా ఉపయోగపడేందుకు భూమి పంపకం ఉండాలని చెప్పారు.

సర్వే లేకుండా ఇష్టం వచ్చినట్టు భూములు పంచడంతో జనం ఇబ్బందులు పడుతున్నారని, ఇచ్చిన భూమి కంటే సర్టిఫికెట్లే ఎక్కువగా ఉంటున్నాయన్నారు. సూర్యాపేట మఠంపల్లి భూములు 1600 ఎకరాలు అయితే, 9 వేల ఎకరాలకు సర్టిఫికెట్లు ఇచ్చారని, మెదక్ జిల్లా శివంపేటలో 200 ఎకరాల భూమికి 600 ఎకరాలకు సర్టిఫికెట్లు ఇచ్చారని అన్నారు. ఇలాంటి లోపాలను తొలగించేందుకే నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తున్నామన్నారు. తాను పుట్టిన ఊళ్లో 91 ఎకరాల భూమికిగాను 136 మందికి సర్టిఫికెట్లు ఇచ్చి 120 ఎకరాల భూమి పంపిణీ చేసినట్లు చూపించారన్నారు. అందుకే కొత్త రెవెన్యూ చట్టం తెచ్చామని, ఇది అంతం కాదు…ఆరంభం అని కేసీఆర్ అన్నారు.