రాజ‌కీయ పార్టీలోకి చేరిన ద‌స్త‌గిరి.. పోటీపై క్లారిటీ

ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసి.. ఆయ‌ననే ఓడిస్తానంటూ.. వ్యాఖ్య‌లు చేసిన ద‌స్త‌గిరి తాజాగా ఓ రాజ‌కీయ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. సీఎం జ‌గ‌న్ చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని దారుణంగా హ‌త్య చేసిన నిందితుల్లో ద‌స్త‌గిరి ఒక‌డు. అయితే.. త‌ర్వాత కాలంలో అప్రూవ‌ర్‌గా మారిపోవ‌డం.. బెయిల్ రావ‌డంతో ప్ర‌స్తుతం బ‌య‌ట‌కు ఉన్నాడు. అయితే.. ఆయ‌న రెండు రోజుల కింద‌ట హైద‌రాబాద్‌లో మాట్లాడుతూ.. తాను వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని చెప్పాడు.

అలా చెప్పిన‌ట్టుగానే తాజాగా గుంటూరు కేంద్రంగా ఉన్న ‘జై భీం భార‌త్’ పార్టీలో చేరాడు. ఈ పార్టీని న్యాయ‌వాది జ‌డ శ్రావ‌ణ్‌కుమార్ న‌డిపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పార్టీ అభ్య‌ర్థుల కోసం వెతుకుతున్న క్ర‌మంలో ద‌స్త‌గిరి గురువారం సాయంత్రం ఆయ‌న‌ను క‌ల‌వ‌డం.. ఆ వెంట‌నే పార్టీలో చేరిపోవ‌డం వ‌డివ‌డిగా జ‌రిగిపోయాయి. ఇక‌, ద‌స్త‌గిరి చేరిన వెంట‌నే జ‌డ శ్రావ‌ణ్‌.. ఆయ‌న‌కు స‌భ్య‌త్వం ఇవ్వ‌డంతోపాటు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పులివెందుల టికెట్ ఇస్తామ‌ని కూడా హామీ ఇచ్చారు.

ఇదిలావుంటే.. ద‌స్త‌గిరి నేటివ్ ప్లేస్‌.. క‌డ‌ప జిల్లా పులివెందులే కావ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ కారు డ్రైవ‌ర్‌గా త‌న ప్ర‌స్తానం ప్రారంభించి.. వైఎస్ వివేకా కుటుంబంలో చేదోడు వాదోడుగా ఉన్నాడు. వివేకా లేన‌ప్పుడు.. ఆయ‌న ఇంటి వ్య‌వ‌హారాలు కూడా ఈయ‌నే చూసుకునేవాడ‌ని గ‌తంలోనే చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి కార‌ణం.. త‌న‌ను రాజ‌కీయంగా ఇబ్బందులు పెడుతున్నార‌ని.. కాబ‌ట్టి.. తాను కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. త‌న‌ను ఇబ్బంది పెట్టిన వారికి త‌గిన బుద్ది చెబుతాన‌ని ఆయ‌న అంటున్నాడు.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా జై భీం భార‌త్ పార్టీలో చేర‌డం గ‌మ‌నార్హం. ఈ పార్టీ అంత‌ర్గ‌తంగా రాష్ట్రంలోని ఓ ప్ర‌ధాన పార్టీకి మ‌ద్ద‌తు దారుగా ఉండ‌డం గ‌మ‌నార్హం. వ‌చ్చే ఎన్నికల్లో 100 స్థానాల్లో పోటీ చేసేందుకు ఈ పార్టీ మొగ్గు చూపుతోంది.