ఇవే చివ‌రి ఎన్నిక‌లు.. వైసీపీ యువ నేత

వైసీపీ యువ నాయ‌కుడు, మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి రెండో కుమారుడు మిథున్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గురువారం రాత్రి రాజంపేట‌లో నిర్వ‌హించిన వైసీపీ నేత‌ల ఆత్మీయ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఇవే త‌న‌కు చివ‌రి ఎన్నిక‌ల‌ని వ్యాఖ్యానించారు. తాను రెండు సార్లు రాజంపేట ఎంపీగా విజ‌యం ద‌క్కించుకోవ‌డంలో నాయ‌కులు, కార్య‌కర్త‌లు ఎంతో శ్ర‌మించార‌ని.. వారిని తాను మ‌రిచిపోలేన‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌ను గెలిపించాల‌ని అన్నారు.

“రాజంపేట అభివృద్ధికి ఎంతో కృషి చేశాను. కేంద్రం నుంచి నిధులు తీసుకువ‌చ్చాను. అనేక ప‌నులు చేయించాను. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోయాను. ఈ సారి ఇదే నాకు చివ‌రి ఎన్నిక‌లు. అయితే.. రాజ‌కీయా ల‌కు దూరంగా మాత్రం ఉండ‌ను. మీ అంద‌రి ఆశీర్వాదంతో ఈ సారి గెలుస్తాన‌ని న‌మ్ముతున్నాను” అని మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాగా, దీనిపై వైసీపీ నాయ‌కులు, టీడీపీ నేత‌లు డిఫ‌రెంట్ టోన్ వ్య‌క్త ప‌రిచారు. తాను ఓడిపోతాన‌ని తెలిసే.. ఇప్పుడు ఇలా వ్యాఖ్యానించార‌ని టీడీపీ నాయ‌కులు చెప్పారు.

అయితే.. వైసీపీ నాయ‌కులు మాత్రం వ‌చ్చే 2029 ఎన్నిక‌ల్లో ఆయ‌న రాజంపేట ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని భావిస్తున్నార‌ని.. ఎంపీ ఎన్నిక‌ల‌కు మాత్ర‌మే విరామం ఇస్తున్నార‌ని చెప్పారు. అయితే.. ఈ విష‌యంలో మిథున్‌రెడ్డి మాత్రం క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదిలావుంటే.. 2014, 2019లో రాజంపేట ఎంపీ స్తానం నుంచి మిథున్‌రెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నారు.

2014లో టీడీపీ-బీజేపీ పార్టీల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా ప్ర‌స్తుత బీజేపీ రాష్ట్ర చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో అతి క‌ష్టం మీద మిథున్‌రెడ్డి వైసీపీ త‌ర‌ఫున తొలిసారివిజ‌యంఅందుకున్నారు. ఇక‌, 2019లో టీడీపీ త‌ర‌ఫున డీకే స‌త్యప్ర‌భ‌(ఆదికేశ‌వుల నాయుడు స‌తీమ‌ణి) టీడీపీ త‌ర‌ఫున పోటీ చేశారు. ఈ ఎన్నిక‌ల్లో మాత్రం సునాయాసంగా మిథున్‌రెడ్డి రెండో సారి విజ‌యం సాధించారు. అయితే.. ఈ సారి మాత్రం టీడీపీ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌లేదు. దీనిని బీజేపీ కోరుతున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం ఉంది.