2019లో అందుకే నేను ఓడిపోయా: నారా లోకేష్‌

‘చంద్రబాబు సూపర్-6’లో పొందుపరిచిన హామీలను ప్రతి గడపకు వెళ్లి తెలియజేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచించారు. సూపర్-6 అనేది పేద, మధ్యతరగతి ప్రజల మేనిఫెస్టో అని అన్నారు. మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని పలు మండలాలకు చెందిన క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జిలతో ఆయ‌న భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం సమస్యలను నేతలు లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. “2019లో ఎన్నికల సమయంలో కేవలం 20 రోజులు ముందు మాత్రమే మంగళగిరి నియోజకవర్గానికి వచ్చా. దీంతో నియోజకవర్గ ప్రజలకు చేరువ కాలేకపోవడంతోనే ఓడిపోయాం” అని నారా లోకేష్ అన్నారు.

కానీ, ఇప్పుడు గ‌త ఐదేళ్లుగా మంగళగిరిలో తిరిగుతూ సంక్షేమ కార్యక్రమాలను సొంత నిధులతో అమలు చేస్తున్నాని చెప్పారు. గెలిస్తే ఇంకెంత సంక్షేమాన్ని అమలు చేస్తానో ప్రజలకు వివరించాల‌ని కార్య‌క‌ర్త ల‌కు సూచించారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి గతంలో కంటే ఇప్పుడు బాగా మెరుగు ప‌డింద‌ని అన్నారు. “మంగళగిరిలో నేను గెలిస్తే కాల్వకట్టల వెంబడి ఇళ్లు తొలగిస్తారని తప్పుడు ప్రచారం చేశారు. కానీ గెలిచాక వైసీపీ నేతలే మంగళగిరి నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో పేదల ఇళ్లు కూలగొట్టారు” అని లోకేష్ అన్నారు.

ముఖ్యమంత్రి జగన్ ఇంటి వద్ద పేదలు ఉండటమే నేరం అన్నట్లు అర్థరాత్రి పేదలను బయటకు తరిమి ఇళ్లు కూల్చారని లోకేష్ అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఇళ్ల తొలగింపు ఎట్టి పరిస్థితుల్లో జరగదని అన్నారు. “పేద‌ల‌కు పట్టాలు అందిస్తాం.. వసతులు కూడా కల్పిస్తాం. సొంతిళ్లు లేని ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించే బాధ్యత నాది. ఇంటికి పట్టాలు లేని వారికి పట్టాలు కూడా అందిస్తాం” అని తెలిపారు. అధికారం లోకి వచ్చాక స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిద్దామ‌ని అన్నారు.

మంగళగిరిని మోడల్ నియోజకర్గంగా తీర్చిదిద్దడమే త‌న లక్ష్యమ‌ని నారా లోకేష్ అన్నారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ నేతల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోయారని, రాజధాని మార్పుతో తాడేపల్లి పట్టణ, రూరల్ ప్రజలు నష్టపోయారని అన్నారు. ఐదేళ్లుగా విజయసాయిరెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి ప్రజలను పట్టించుకోలేదని విమ‌ర్శించారు.

సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు..ఆ వ్యవస్థలను రద్దు చేసే ఉద్దేశం మాకు లేదని అన్నారు. వాటిని స్థానిక సంస్థలతో కలిసి పని చేసే విధంగా బలోపేతం చేస్తామ‌ని తెలిపారు. రైతుల, స్వర్ణకారులు, చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై నాకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వారి సమస్యలు పరిష్కరిస్తామ‌న్నారు. ఈ ప్రభుత్వం పథకాలు రద్దు చేస్తోంది. మన ప్రభుత్వం వచ్చాక మళ్లీ అందిద్దాం. గెలుస్తున్నాం అని నిర్లక్ష్యం వద్దు.. అని లోకేష్ కార్య‌క‌ర్త‌ల‌కు తేల్చి చెప్పారు.