వైసీపీ ‘సిద్ధం’ స‌భ వాయిదా.. రీజ‌నేంటి?

ఏపీ సీఎం జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి నిర్వ‌హిస్తున్న సిద్ధం స‌భ‌ల గురించి తెలిసిందే. ఇప్ప‌టి కి 3 సిద్దం స‌భ‌లు నిర్వ‌హించారు. ఇప్పుడు నాలుగో స‌భ‌ను ప్ర‌కాశం జిల్లా ఒంగోలులో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. అనూహ్యంగా ఈ స‌భ‌ను వాయిదా వేశారు. వాస్త‌వానికి ఏర్పాట్లు కూడా చేసుకు న్న త‌ర్వాత‌.. ఈ స‌భ వాయిదా ప‌డ‌డం గ‌మ‌నార్హం. దీనికి కార‌ణం.. ఎన్నిక‌ల్లో పొత్త‌లేన‌ని తెలుస్తోంది. మంగ‌ళ‌వారం రాష్ట్రంలో ప‌ర్య‌టించిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌.. వ‌చ్చేది బీజేపీ ప్ర‌భుత్వ‌మేన‌ని వ్యాఖ్యానించారు.

ఈ నేప‌థ్యంలో అలెర్ట్ అయిన‌.. జ‌గ‌న్‌.. ఢిల్లీకి వెళ్తున్నార‌ని తెలుస్తోంది. ప్రధాని మోడీ అపాయింట్ మెం ట్ కోసం సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని తాడేప‌ల్లి వ‌ర్గాలు తెలిపాయి. అపాయింట్‌మెంట్ లభించే అవకాశం ఉండటంతో సభను వాయిదా వేసుకున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల‌లో ఇప్ప‌టికే ఒక‌సారి ప్ర‌ధాని మోడీని క‌లిసి వ‌చ్చారు సీఎం జ‌గ‌న్‌. అప్పట్లో చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. తర్వాత బీజేపీతో పొత్తుల అంశంపై ఏపీలో విస్తృత ప్రచారం జరిగింది. కానీ, ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.

కానీ, ఇప్పుడు మ‌రోసారి టీడీపీ ఎన్డీఏలో చేరుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఇంత‌లోనే టీడీపీ-జ‌నసేన సంయుక్తంగా తొలి జాబితాను ప్రకటించాయి. ఇందులో ఎంపీ అభ్యర్థులను మాత్రం ఖరారు చేయలేదు. దీనిని కేవ‌లం బీజేపీ కోస‌మే ఆపిన‌ట్టు మిత్ర‌ప‌క్షాలు చెబుతున్నాయి.అంటే.. బీజేపీ క‌లిసి వ‌చ్చేస్తోంద‌న్న వాద‌న‌ను మిత్ర‌ప‌క్షాలు చెబుతున్నాయి. ఇంత‌లోనే కేంద్ర మంత్రి మంగ‌ళ‌వారం చేసిన వ్యాఖ్య‌లు కూడా.. బీజేపీ.. టీడీపీతో క‌లిసి న‌డించేందుకు రెడీ అయింద‌ని దాదాపు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.

ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ ఆక‌స్మికంగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తుండడం గ‌మ‌నార్హం. దీనిపై టీడీపీ నేత‌లు త‌మ బంధాన్ని చెడ‌గొట్టేందుకే జగన్ లాబీయింగ్ చేస్తున్నారని అంటున్నారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ చేరితే తాము మద్దతివ్వలేని పరిస్థితులు వస్తాయని వైసీపీ వర్గాలు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. వైసీపీని దూరం చేసుకునే ఆలోచనలో బీజేపీ కూడా లేదని అంటున్నారు. అయితే వైసీపీ ఎన్డీఏలో చేరే అవకాశం లేదు. మ‌రి ఈ నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుంద‌నేది చూడాలి.