ఢిల్లీకి కేసీఆర్‌.. బీజేపీతో పొత్తుకేనా? పొలిటిక‌ల్ టాక్‌!

తెలంగాణ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ అనారోగ్యం కారణంగా మూడు నెలలుగా బయటకు రాకుండా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల నల్గొండ సభకు వచ్చారు. నీళ్ల వివాదంపై ఆయ‌న త‌న‌దైన శైలిలో వ్యాఖ్య‌లు గుప్పించారు. తాజాగా కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఉంటుందని వార్తలు వస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈ ప‌ర్య‌ట‌న‌కు ఇంత ప్రాధాన్యం పెర‌గ‌డానికి కార‌ణం పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌నేన‌ని తెలుస్తోంది.

బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందని ఓ వైపు ఊహాగానాలు ఉన్నాయి. మరోవైపు, సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ఇంకో 20 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ ఎవర్ని కలుస్తారనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. మరోవైపు, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని ఇరుకున‌ పెడుతోంది. కేసీఆర్ హాయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలను బాగా హైలెట్ చేస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో భాగస్వామ్యం ఉన్న ఏ ఒక్కరిని వదలబోమని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెబుతున్నారు. ప్రస్తుతం ఒంటరిగా కాంగ్రెస్ పార్టీని ఢీకొనడం కష్టం అనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లుగా రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే బీఆర్ఎస్ అధినేత వ్యూహాత్మ‌కంగా మోడీకి చేరువ అవుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. బీజేపీ తోడైతే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించవచ్చనే ఆలోచనతో ఉన్నారని తెలుస్తోంది. ఆ విషయంలో బీజేపీ పెద్దలను కేసీఆర్ కలుస్తారని ప్రచారం జరుగుతోంది.

ఇటీవలే బీజేపీ అగ్రనేత అమిత్ షా మాట్లాడుతూ.. ఎన్డీఏతో కలిసి వచ్చేందుకు చాలా పార్టీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయని అన్నారు. త్వరలోనే ఎన్డీఏలో కొత్త మిత్రుల‌ చేరికలు ఉంటాయని అన్నారు. ఆ వ్యాఖ్యలను బట్టి.. ఇప్పుడు కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్తుండడం పొత్తు కోసమే అనే వాదనకు బలం చేకూరుతోంది. అయితే, కేసీఆర్ ఢిల్లీ పర్యటన అజెండా ఏంటో, ఎవరెవర్ని కలుస్తారనే విష‌యాల‌ను పార్టీ గోప్యంగా ఉంచింది. అయితే.. ఇక్క‌డ మరో వాద‌న కూడా ఉంది. ఢిల్లీలో బీఆర్ ఎస్ భ‌వ‌న్ నిర్మాణం జ‌రుగుతున్న నేప‌థ్యంలో దానిని ప‌ర్య‌వేక్షించేందుకే కేసీఆర్ వెళ్తున్నార‌ని అంటున్నారు.