కొణతాలను సైడేసిన నాగబాబు?

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ఉంది నాగబాబు వ్యవహారం. డ్యామేజి జరిగిపోయిన తర్వాత జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కంట్రోల్ కు దిగారు. ఇంతకీ విషయం ఏమిటంటే నాలుగు రోజులుగా నాగబాబు ఉత్తరాంధ్రలోనే మకాంవేశారు. అదికూడా అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లోనే పర్యటిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నేతలతో పర్యటిస్తున్న నాగబాబు సమీక్షలు కూడా చేస్తున్నారు. అయితే సీనియర్ నేత, మొదటినుండి పార్టీ జెండాను మోస్తున్న శివశంకర్ ను మాత్రం పట్టించుకోలేదు.

రాబోయే ఎన్నికల్లో పెందుర్తి నుండి పోటీ చేయాలని శివశంకర్ చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే వైసీపీ నుండి వచ్చిన పంచకర్ల రమేష్ కు టికెట్ ను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారట. అందుకనే శివశంకర్ ను పార్టీ నాయకత్వం పట్టించుకోవటంలేదు. మరి దీని ప్రభావం రాబోయే ఎన్నికల్లో ఎలాగ ఉంటుందో చూడాలి. ఇదే పద్దతిలో అనకాపల్లికి చెందిన కొణతాల రామకృష్ణను కూడా ఎవరు పట్టించుకోవటంలేదు. ఈమధ్యనే పవన్ పిలుపు మేరకు కొణతాల పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

రాబోయే ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు టికెట్ హామీతోనే కొణతాల జనసేనలో చేరారనే ప్రచారం అందరికీ తెలిసిందే. పార్టీలో చేరేంతవరకు కొణతాలపై బాగా ఇంట్రస్టుచూపించిన నాయకత్వం ఇపుడు పట్టించుకోవటంలేదు. కొద్దిరోజులుగా అనకాపల్లిలోనే క్యాంపు వేసిన నాగబాబు మాజీ ఎంపీ కొణతాలను కనీసం కలవను కూడా కలవలేదు. సమావేశాలకు, సమీక్షలకు కూడా పిలవలేదు. దాంతో నాగబాబు వ్యవహారంపై పార్టీలో బాగా అసంతృప్తి పెరిగిపోయింది. రాబోయే ఎన్నికల్లో దీని ప్రభావం పార్టీ గెలుపుపై పడుతుందని అనుకున్నట్లున్నారు. అందుకనే సడెన్ గా కొణాతల ఇంటికి నాగబాబు వెళ్ళారు.

ఇంతకీ కొణతాలను జనసేన ఎందుకు పట్టించుకోవటంలేదు ? ఎందుకంటే అనకాపల్లి ఎంపీగా నాగబాబే పోటీచేయబోతున్నారనే ప్రచారం తెలిసిందే. ఒకవైపు నాగబాబే పోటీచేస్తున్నారని అనుకుంటున్నపుడు ఇక ఎంపీ టికెట్ ను ఆశిస్తున్న కొణతాలను ఎవరు పట్టించుకుంటారు ? మరిదే నిజమైతే అసలు కొణతాలను పార్టీలో పవన్ ఎందుకు చేర్చుకున్నట్లు ? అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఏదేమైనా శివశంకర్, కొణతాల విషయంలో పార్టీకి జరిగిన డ్యామేజి కంట్రోల్ అవుతుందా ? అన్నదే అసలైన పాయింట్.

నాలుగు రోజులుగా నాగబాబు ఉత్తరాంధ్రలోనే మకాంవేశారు. అదికూడా అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల్లోనే పర్యటిస్తున్నారు.