‘రాజ‌ధాని ఫైల్స్‌’కు చంద్ర‌బాబు ప్ర‌మోష‌న్‌

ఏపీ రాజ‌ధాని ‘అమ‌రావతి’ విధ్వంసం.. ఇక్క‌డి రైతుల ఆవేద‌న, ఉద్య‌మం, ఆందోళ‌న‌లు, పాద‌యాత్ర‌.. వైసీపీ స‌ర్కారు మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌ను క‌ధా వ‌స్తువుగా చేసుకుని రూపొందించిన ‘రాజ‌ధాని ఫైల్స్‌’ సినిమాను అంద‌రూ చూడాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. సీఎం స్థానంలో ఉన్న ఓ వ్యక్తి ఓ ప్రాంతంపై కక్షగట్టి.. రాష్ట్ర రాజధానిపై పగబట్టి సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అధికారం అండతో ఉద్యమకారులను చిత్రహింసలకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“రాజ‌ధానిపై వైసీపీ కుట్రలు, దారుణాలకు ‘రాజధాని ఫైల్స్’ చిత్రం అద్దం పట్టింది. తెలుగు ప్రజలంతా థియేటర్లకు వెళ్లి ఈ సినిమా చూసి వాస్తవాలు తెలుసుకోవాలి. జగన్ క్రూరత్వానికి, వైసీపీ విధ్వంసానికి నాశనమైన రాజధాని.. దాని కోసం ఎన్నో త్యాగాలు చేసిన ప్రజల కష్టాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. అందుకే ఈ చిత్ర విడుదలను ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ న్యాయస్థానంలో వారి ఆటలు సాగలేదు. జగన్ రెడ్డి నీ సినిమా అయిపోయింది. అసలు సినిమా ఇప్పుడు మొదలవుతుంది… కాస్కో” అంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

ఇక‌, టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు కూడా.. సినిమా పై ఏకంగా రివ్యూనే రాసుకొచ్చారు. చాలా జాగ్ర‌త్త‌గా ఈ సినిమాను తెర‌కెక్కించార‌ని.. రైతుల ఆవేద‌న‌, బాధ‌తో పాటు.. రాష్ట్రానికి అమ‌రావ‌తి ప్ర‌యోజ‌నం.. దానివ‌ల్ల ఒన‌కూరే ల‌బ్ధిని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు వివ‌రించార‌ని.. అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏపీలో ఉన్న ప్ర‌జ‌ల‌తోపాటు.. అమ‌రావ‌తిపై ప్రేమ ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ఈ సినిమాను వీక్షించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. వైసీపీ దుర్మార్గాల‌కు అంతులేకుండా పోయింద‌ని.. రైతుల‌ను ఎలా చిత్ర‌హింస‌ల‌కు గురి చేశారో.. ఈ సినిమా క‌ళ్ల‌కు క‌ట్టింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇదిలావుంటే.. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుల కోసం.. తెనాలిలోని ఓ సినిమా హాల్‌ను శనివారం తొలి ఆట కోసం బుక్ చేసిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.