బీఆర్ఎస్ కు ఎంఎల్ఏల షాక్

బీఆర్ఎస్ అధిష్టానానికి సొంత ఎంఎల్ఏలే పెద్ద షాకిచ్చారు. విషయం ఏమిటంటే అసెంబ్లీ సమావేశాలు చాలా వాడివేడిగా జరుగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ తరపున మెజారిటి సభ్యులు సమావేశాలకు హాజరవుతున్నారు. అదే బీఆర్ఎస్ లో చూస్తే చాలామంది హాజరుకావటంలేదు. నల్గొండ బహిరంగసభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని,రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేసీయార్ చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలపై బుధవారం సభ దద్దరిల్లిపోయింది. రేవంత్ అండ్ కో కేసీయార్ తో పాటు బీఆర్ఎస్ ను అంతేస్ధాయిలో ఎదురుదాడికి దిగారు.

దాంతో రెండువైపులా ఆరోపణలు, విమర్శలతో సమావేశాలు చాలా ఉద్రిక్తంగా జరిగాయి. కాంగ్రెస్ ధాటిని తట్టుకోలేక చివరకు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు సభనుండి వాకౌట్ చేయాల్సొచ్చింది. సభ నుండి వాకౌట్ చేయాల్సిన పరిస్ధితి ఎందుకొచ్చింది ? ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంఎల్ఏలు ఎక్కువమంది కనబడటంలేదు కాబట్టే. బుధవారం సమావేశానికి పట్టుమని పదిమంది కూడా కనబడలేదట. దీన్ని గమనించి కేటీయార్, హరీష్ రావులు ఎంఎల్ఏలకు ఫోన్లుచేశారట. దాంతో సమావేశాలు మొదలైన తర్వాత అసెంబ్లీలో 15 మంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కనిపించారు.

తర్వాత సభ నుండి వాకౌట్ చేసినా ఆ తర్వాత ధర్నా చేసినా 15 మంది ఎంఎల్ఏలకన్నా కనబడలేదు. పార్టీకి ఉన్న 39 మంది ఎంఎల్ఏల్లో 15 మంది మాత్రమే సభకు హాజరవుతున్నారంటే అర్ధమేంటి ? మిగిలిన 24 మంది ఎంఎల్ఏలు అసెంబ్లీకి ఎందుకు హాజరుకావటంలేదనే విషయంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవైపు కేసీయార్, కేటీయార్, హరీష్ రావులను రేవంత్ రెడ్డి, మంత్రులు వాయించేస్తుంటే తమను తాము డిఫెండ్ చేసుకోవటానికి కూడా ఎంఎల్ఏల మద్దతు దొరకటంలేదు.

ఈ పరిస్ధితిని గ్రహించే కేసీయార్ అసలు అసెంబ్లీకే రాలేదు. ఎంఎల్ఏగా ప్రమాణస్వీకారం చేసిన కేసీయార్ నల్గొండలో జరిగిన బహిరంగసభకు వీల్ చైర్లో వెళ్ళారు కాని అసెంబ్లీకి మాత్రం రావాలని అనుకోలేదు. కారణం ఏమిటంటే రేవంత్ అండ్ కో ధాటిని తట్టుకోలేమన్న ఆలోచనతోనే అని పార్టీవర్గాల సమాచారం. సమావేశాలకు 24 మంది ఎంఎల్ఏలు గైర్హాజరవుతున్నారంటే ఇదేదో సీరియస్ విషయంగానే ఉంది. ఎందుకంటే కొందరు ఎంఎల్ఏలు తొందరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు జరుగుతన్న ప్రచారం తెలిసిందే. సభకు గైర్హాజరవ్వటం కూడా ఇందులో బాగమేనా ?