ఇక‌, చాలు! వైసీపీ నేత‌ల‌ను తీసుకోలేం: చంద్ర‌బాబు

వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చేందుకు కొంద‌రు నేత‌లు ఎదురు చూస్తున్నార‌న్న వార్త‌ల నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. ఇప్ప‌టి వ‌రకు ట‌చ్‌లో చాలా మంది వ‌చ్చార‌ని.. అయితే, వారి గ్రాఫ్‌, ప్ర‌జ‌ల్లో వారికి ఉన్న సానుబూతి వంటి వాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్న‌ట్టు తెలిపారు. “ఎంతో మంది నాతోనూ ట‌చ్‌లోకి వ‌చ్చారు. అయితే, అంద‌రికీ ఆహ్వానం ప‌ల‌క‌లేం. వారు ఎందుకు వ‌స్తున్నారో.. ఏం చేయాల‌ని భావిస్తున్నారో ముందు చూడాలి. కొంద‌రు.. టికెట్లు కూడా ఆశిస్తున్నారు. వ‌చ్చిన వారంద‌రికీ టికెట్లు ఇచ్చుకుంటూ పోలేం” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన‌ట్టు పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు ఒక‌రు తెలిపారు.

ఇప్ప‌టికే పొత్తుల కార‌ణంగా చాలా మంది నాయ‌కుల‌ను ప‌క్క‌న పెట్టాల్సి వ‌స్తోంద‌ని చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు తెలిసింది. తాజాగా పార్టీ సీనియ‌ర్ నాయ‌కుల‌తో ఉండ‌వ‌ల్లిలోని నివాసంలో భేటీ అయిన చంద్ర‌బాబు.. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించిన ప్ర‌ణాళిక‌ను వారికి వివ‌రించారు. మ‌రో 56 రోజులు మాత్ర‌మే ఎన్నిక‌ల‌కు గ‌డువు ఉంద‌ని.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవరు ఏం చేశారో.. ఎలా ఉన్నారో.. దానిని తాను ప్ర‌శ్నించ‌ద‌లుచుకోలేద‌ని.. కానీ, ఈ 56 రోజులు మాత్రం ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ముందుకుసాగాల‌ని పార్టీ నాయ‌కుల‌కు సూచించారు. ఇప్ప‌టికే రా.. క‌ద‌లిరా! కార్య‌క్ర‌మం ముగిసింద‌ని.. ప్ర‌స్తుతం శంఖారావం కొనసాగుతోంద‌ని మ‌రిన్ని కార్య‌క్ర‌మాల కు రూప‌క‌ల్ప‌న చేస్తున్నామని చంద్ర‌బాబు చెప్పారు.

“పొత్తులు, కొత్త చేరికల వల్ల పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడిన నేతల రాజకీయ భవిష్యత్‌కు నష్టం జగరకుండా చూడడానికే ప్రాధాన్యం ఇస్తున్నాం. ఎవ‌రూ హ‌ర్ట్ కాకూడ‌దు. టికెట్ రాలేదంటే వారి పెర‌ఫార్మెన్స్‌పై న‌మ్మ‌కం లేక కాదు.. వారిని ప‌నికి రాని వారిగా తేల్చిన‌ట్టు కూడా కాదు. ప్రస్తుతం కీల‌క‌మైన యుద్ధ స‌మ‌యంలో ఉన్నాం. కాబ‌ట్టి బ‌లంగాఈ యుద్ధాన్ని గెలిచేవారికే టికెట్లు ఇస్తున్నాం. మిగిలిన వారు పార్టీ కోసం.. ప‌నిచేయాలి. అదికారంలోకి వ‌చ్చాక‌.. అంద‌రికీ మేలు జ‌రిగేలా నిర్ణ‌యాలు ఉంటాయి. ఈ విష‌యాన్ని క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు వివ‌రించండి” అని చంద్ర‌బాబు దిశానిర్దేశం చేశారు.