గ్రేటర్లో ఖాళీ అయిపోతోందా ?

గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఖాళీ అయిపోతోందా ? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొన్ననే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి సడెన్ గా రేవంత్ రెడ్డిని కలిసారు. ముఖ్యమంత్రితో తన సమావేశం పూర్తిగా అధికారికమే అని గద్వాల చెబుతున్నా ఎవరు నమ్మటంలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రిని ఎవరు ఏ కారణంతో కలిసినా చెప్పేది మాత్రం అధికారికమని, నియోజకవర్గాలకు నిధుల కోసమనే చెబుతారు.

అలాగే రెండు రోజుల క్రితమే మాజీ డిప్యుటి మేయర్ బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ లో చేరిపోయారు. ఈయనకు ముస్లిం కార్పొరేటర్లలో మంచి పట్టుంది. రెండు రోజుల క్రితం గ్రేటర్ పరిధిలోని పార్టీ కార్పొరేటర్లతో కేటీయార్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యుటి మేయర్ శ్రీలతో పాటు మరికొందరు కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. ఈ గైర్హాజరుతో పార్టీలో పెద్ద కలకలం మొదలైంది. తమవ్యక్తిగత కారణాలతోనే తాను సమావేశానికి హాజరుకాలేకపోయినట్లు డిప్యుటి మేయర్ చెప్పినా ఎవరు నమ్మటంలేదు.

ప్రస్తుతం పరిస్ధితులు ఎలాగున్నాయంటే ఏ కారణంతో ప్రతిపక్షాల నేతలు ముఖ్యమంత్రిని కలిసినా పార్టీ మారిపోవటం ఖాయమనే ప్రచారమైతే జరిగిపోతోంది. దీనికి మూల కారణం ఏమిటంటే రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో అవిశ్వాసతీర్మానాలు పెట్టి బీఆర్ఎస్ ఛైర్మన్లను దింపేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 20 మున్సిపాలిటిల్లోని బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరిపోయి అవిశ్వాస తీర్మానాలు పెట్టి ఛైర్మన్లను దింపేశారు. దాంతో లాటరీ తగిలినట్లుగా సుమారు 20 మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. ఒక్కో మున్సిపాలిటి కాంగ్రెస్ ఖాతాలో పడుతున్నపుడు ఇక గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ను మాత్రం కాంగ్రెస్ ఎందుకు వదులుతుంది.

ఇందులో భాగంగానే మేయర్ గద్వాల రేవంత్ ను కలవటం, వెంటనే మాజీ మేయర్ కాంగ్రెస్ లో చేరటం, కేటీయార్ మీటింగుకు డిప్యుటి మేయర్, కొందరు కార్పొరేటర్లు గైర్హాజరవటం అనే ప్రచారం పెరిగిపోతోంది. ఒక సమాచారం ప్రకారం బీఆర్ఎస్ కు చెందిన 56 మంది కార్పొరేటర్లలో 26 మంది కాంగ్రెస్ లోకి జంప్ చేయటానికి రెడీగా ఉన్నారట. ఎంఐఎం సహకారం కూడా ఓకే అయిపోతే ఆ ముచ్చటేదో అయిపోతుంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.