అఖిల ఒంటరైపోయిందా ?

భూమా ఫ్యామిలిలో జరుగుతున్న డెవలప్మెంట్ల కారణంగా మాజీమంత్రి భూమా అఖిలప్రియ ఒంటరిపోయారు. ఆమెకు పార్టీతో పాటు కుటుంబంలో కూడా మద్దతు దొరకటంలేదు. ఇక ప్రజామద్దతు అంటే ఎన్నికల్లో మాత్రమే తెలుస్తుంది. విషయం ఏమిటంటే మాజీమంత్రిది మొదటినుండి బాగా దూకుడుస్వాభావమే. దానికితోడు భర్త భార్గవరామ్ ది అఖిలకు మించిన దూకుడు స్వభావమట. అందుకనే ఇద్దరు కలిసిన దగ్గర నుండి అఖిల చాలా వివాదాల్లో ఇరుక్కునేశారు. రాజకీయంగా ఎదగాలన్న ఆరాటం, తన పరిస్ధితిపై తనకు విపరీతమైన ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా తరచూ వివాదాల్లో కూరుకుపోతున్నారు.

అఖిలపైన ఫోర్జరీ, కిడ్నాపులు, హత్యకు కుట్ర, మోసాలు, దాడుల కేసులు చాలా నమోదయ్యాయి. కిడ్నాప్ కేసులో జైలు ఉండి బెయిల్ పైన బయట తిరుగుతున్నారు. ఇలాంటి వ్యక్తి కాబట్టే అఖిలను పార్టీ దూరంగా పెట్టేసింది. అయితే అఖిలను పార్టీలో నుండి బయటకు మాత్రం పంపటం లేదు. అందుకనే ఆమె టీడీపీ నేతగానే చెలామణి అవుతున్నారు. దంపతుల వైఖరి నచ్చకే కుటుంబం దూరంగా పెట్టేసింది. ఈ మధ్యనే భూమా కుటుంబీకులు మీటింగ్ పెట్టుకుని అఖిలను దూరంగా ఉంచాలని డిసైడ్ చేశారు.

ఎట్టి పరిస్ధితుల్లోను భూమాకు ఆళ్ళగడ్డ టికెట్ రానీకుండా చేయాలని, ఒకవేళ టికెట్ తెచ్చుకుంటే ఓడించాలని తీర్మానించుకున్నారు. మొత్తం భూమా కుటుంబీకులంతా భూమా కిషోర్ రెడ్డికే మద్దతుగా నిలవాలని కూడా తీర్మానం అయ్యింది. దాంతో పార్టీలోనే కాకుండా చివరకు కుటుంబంలో కూడా అఖిల ఒంటరైపోయిందన్న విషయం బయటపడింది. అయితే పార్టీలో ఇంత జరుగుతున్నా ఆళ్లగడ్డ టికెట్ అఖిలకే అన్న ప్రచారం బాగా జరుగుతోంది.

ఇంత వివాదాస్పదమైన అఖిలకే మళ్ళీ టికెట్ ఇస్తే వైసీపీ ఎంఎల్ఏ బిజేంద్రనాధ్ రెడ్డి గెలుపుకు పెద్దగా కష్టపడక్కర్లేదనే సెటైర్లు పెరిగిపోతున్నాయి. అందుకనే బీజేపీలో యాక్టివ్ గా ఉంటున్న కిషోర్ రెడ్డి గెలుపుకు కుటుంబీకులంతా పనిచేయాలని కూడా తీర్మానం జరిగింది. జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకునే పార్టీలో సీనియర్ తమ్ముడు ఏవీ సుబ్బారెడ్డి ఆళ్ళగడ్డ టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే అఖిలకు కాకుండా టికెట్ తనకిస్తే మొత్తం భూమా కుటుంబాన్ని తనకు మద్దతుగా పనిచేయించుకోవచ్చన్నది ఏవీ ఆలోచన. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.