బరాబర్ రేవంత్ ను కలుస్తా: మల్లారెడ్డి

బీఆర్ఎస్ నేత, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. సోషల్ మీడియాలో సినీ హీరోలకు పోటీగా తనకు కూడా ఫాలోయింగ్ ఉందని మల్లారెడ్డి స్వయంగా చెప్పిన వీడియో వైరల్ అయింది. ఇక, కాంగ్రెస్ గెలవగానే మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పబోతున్నారని జోరుగా ఊహాగానాలు వినిపించాయి. ఆ టాక్ కు తగ్గట్లుగానే ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశానికి మల్లారెడ్డి డుమ్మా కొట్టారు.

ఆ భేటీకి మల్లారెడ్డితోపాటు ఆయన అల్లుడు,మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు గైర్హాజరు కావడం సంచలనం రేపింది. అయితే, ఆ తర్వాత వారంతా బీఆర్ఎస్ లోనే కొనసాగారు. ఈ క్రమంలోనే తాజాగా మల్లారెడ్డి చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి. బరాబర్ రేవంత్ ను కలుస్తా అంటూ మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. తన నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల కోసం సీఎంను కలిస్తే తప్పేంటని మల్లారెడ్డి ప్రశ్నిస్తున్నారు. గతంలో తాము టీడీపీలో కలిసి పనిచేశామని మల్లారెడ్డి చెప్పారు.

ఇక, రాబోయే లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి ఎంపీగా పోటీ చేయాలని తనను బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారని, కానీ, తాను ఆ టికెట్ ను తన కుమారుడికి అడుతున్నానని అన్నారు. ఇటీవల, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్తా ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రావు, మహిపాల్ రెడ్డి కలవడంతో వారు కాంగ్రెస్ లో చేరుతున్నారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత రేవంత్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిశారు. అయితే, తామంతా మర్యాదపూర్వకంగా, నియోజకవర్గంలోని పెండింగ్ పనుల కోసం కలిశామని చెప్పుకొచ్చారు.