24 ఏళ్ల త‌ర్వాత‌.. కారుకు చిన్న స‌ర్వీసింగ్ అంతే: కేటీఆర్

గ‌త ఏడాది జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ ఓడిపోయిన విష‌యం తెలిసిందే. అయితే.. దీనిపై ఎప్పుడూ.. ఆ పార్టీ నాయ‌కులు బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేసింది లేదు. పైగా బాధ‌ప‌డిందీ లేదు. మాజీ మంత్రులు కేటీఆర్ నుంచి హ‌రీష్‌రావు వ‌ర‌కు అంద‌రూ.. పెద్ద‌గా దీనిపై స్పందించింది ఎప్పుడూ లేదు. కేవలం స్పీడు బ్రేకులు మాత్ర‌మే ప‌డ్డాయ‌ని వ్యాఖ్యానించారు. అదే క్ర‌మంలో తాజాగా మ‌రోసారి కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో నిర్విరామంగా 24 ఏళ్లుగా ప‌నిచేసిన కారుకు ఇప్పుడు చిన్న‌పాటి స‌ర్వీసింగ్ మాత్ర‌మే వ‌చ్చింద‌న్నారు.

కారు తిరిగి పుంజుకుంటుంద‌ని.. మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని 14 నియోజ క‌వ‌ర్గాల్లో బీఆర్ ఎస్ అభ్యర్థులు కేవలం స్వ‌ల్ప మెజారిటీతోనే ఓడిపోయార‌ని వ్యాఖ్యానించారు. అదే విధంగా అధికారంలోకి వ‌చ్చిన‌ కాంగ్రెస్‌ పార్టీ కంటే కేవలం 1.8 శాతం ఓట్లు మాత్రమే త‌మ‌కు త‌క్కువ పోల య్యాయ‌ని చెప్పారు. తామేమీ నిరాశ చెంద‌డం లేద‌ని చెప్పారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలా విజ‌యం ద‌క్కించుకోవాల‌న్న విష‌యంపై క‌స‌ర‌త్తు చేస్తున్నామ‌న్నారు. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో విజ‌యం త‌మ‌దేన‌ని అన్నారు.

“ఆయ‌న మేనేజ్‌మెంట్ కోటాలో వ‌చ్చారు” అని సీఎం రేవంత్ పై కేటీఆర్ స‌టైర్లు వేశారు. “మాణిక్కం ఠాకూరుకు 50 కోట్లు ఇచ్చి… మేనేజ్‌మెంట్ కోటాలో ముఖ్య‌మంత్రి అయ్యాడ‌ని అనుకుంటున్నాం” అని వ్యాఖ్యానించారు. త‌మ హ‌యాంలో అవినీతి జరిగింద‌ని ఆరోపిస్తున్నార‌ని.. ఆరోప‌ణ‌లు కాదు.. ఇప్పుడు ప్ర‌భుత్వం మీ చేతిలోనే ఉంది కాబ‌ట్టి.. విచార‌ణ చేసి చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ సవాల్ రువ్వారు. 39 ఎమ్మెల్యేలు కలిసి ప్రభుత్వాన్ని దిగ్బంధం చేస్తామన్న కేటీఆర్.. పోయింది అధికారం మాత్రమేనని పోరాట పటిమ కాదని అన్నారు.