జాతీయ పార్టీకి కేసీఆర్ ఏర్పాట్లు?

టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించి తరచూ వినిపించే విశ్లేషణ ఒకటి తాజాగా హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గులాబీ బాస్.. గడిచిన రెండు దఫాలుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటమే కాదు.. ప్రత్యర్థులు సమీపానికి రాలేని రీతిలో పావులు కదిపిన ఆయన.. తాజాగా జాతీయ రాజకీయాల మీద ఫోకస్ చేశారా? అంటే అవునని చెబుతున్నారు. కేంద్రం మీద గుర్రుగా ఉన్న ప్రతిసారీ ఆయన జాతీయ రాజకీయాల మీద కసరత్తు చేస్తున్నట్లుగా వార్తలు వస్తుంటాయి. తాజాగా అలాంటి వార్తలే మళ్లీ వస్తున్నాయి.

జీఎస్టీ పరిహారం చెల్లింపు విషయాల్లో కేంద్రం వర్సెస్ రాష్ట్రాలన్న రీతిలో.. వ్యవహారం నడుస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో.. రాష్ట్రాలు కోరుకుంటున్న పరిహారానికి కేంద్రం ఇస్తానని చెబుతున్న దానికి పొంతన లేకుండా పోయింది. మోడీ సర్కారు తీరుపై ఆగ్రహంతో ఉన్నప్పటికి పలు రాష్ట్రాధినేతలు మారు మాట్లాడకుండా టైం కోసం చూస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత మాత్రం.. ఇదే అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

అంతకంతకూ తన పరిధుల్ని విస్తరిస్తుంచుకుంటూ పోతే.. రాష్ట్రాల అధికారాల్ని కుంచించుకుపోయేలా చేస్తున్నారంటూ మోడీ సర్కారుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కొన్ని రాష్ట్రాధినేతలు. అంతేకాదు.. జమిలి ఎన్నికల్ని తీసుకురావాలన్న ఆలోచనలో మోడీ సర్కారు ఉంది. అంతేకాదు.. ఇప్పుడున్న తరహా ఎన్నిలకు భిన్నంగా.. అధ్యక్ష తరహా పాలనకు కూడా మోడీ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇలాంటివేళ.. జాతీయ స్థాయిలో ప్రాంతీయ నాయకత్వాల్ని ఏకం చేసి.. ఒక వేదికను ఏర్పాటు చేయాలన్నదే కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. ఇందులో భాగంగా.. జాతీయ స్థాయిలో ఒక పార్టీని ఏర్పాటు చేయాలన్న యోచనలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే పలు అంశాల్లో ఒకే దేశం.. ఒకే విధానం పేరుతో ముందుకెళుతున్న మోడీ.. రానున్న రోజుల్లో రాష్ట్రాల మీద ఆధారపడకుండా.. వ్యక్తుల ఆధారంగా ఎన్నికలు జరిగే అధ్యక్ష ఎన్నికల తరహాలో భారత్ ను మార్చాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అందుకు తగ్గట్లు రాజ్యాంగ సవరణను చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

ఇలాంటి వాటికి చెక్ చెప్పేందుకు కేసీఆర్ కొత్త ఆలోచనలకు తెర తీయటమే కాదు.. కొత్త జెండా.. ఎజెండాను సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు అవసరమైన కసరత్తు ఇప్పటికే ఆయన పూర్తి చేశారని.. పార్టీ పేరును రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలుగా పావులు కదుపుతున్నట్లు చెబుతున్నారు. బీజేపీ.. కాంగ్రెస్ పార్టీలు రెండు దేశ ఆకాంక్షను నెరవేర్చలేకపోయాయని.. అందుకు మూడో ఫ్రంట్ తప్పనిసరి అన్న పేరుతో జరుగుతున్న ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెబుతున్నారు.

దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు న్యాయకోవిదులతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పలు అంశాలు త్వరలోనే తెర మీదకు రానున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ.. ఇప్పుడు జరుగుతున్న ప్రచారానికి తగ్గట్లు జాతీయ స్థాయి పార్టీ ఏర్పాటు దిశగా గులాబీ బాస్ ప్రయత్నాల్ని షురూ చేయటం నిజమైతే.. దేశ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోవటం ఖాయమని చెప్పక తప్పదు.