పెద్దిరెడ్డి.. ల‌క్ష‌ల కోట్లు ఎలా పోగేశారు: వైసీపీ ఎమ్మెల్యే

వైసీపీలో అసంతృప్తి సెగ‌లు పొగ‌లు క‌క్కుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థుల‌కు కోరుకున్న సీట్లు ఇవ్వ‌కపోవ‌డం.. త‌మ‌ను ఇష్టం లేకున్నా.. వేరే వేరే నియోజ‌క‌వ‌ర్గాల‌కు బ‌దిలీ చేయ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో నాయ‌కులు ర‌గిలిపోతున్నారు. కొంద‌రు ఇప్ప‌టికే రాజీనామాలు చేయ‌గా.. మ‌రికొంద‌రు నెమ్మ‌ది నెమ్మ‌దిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలోని స‌త్య‌వేడు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బ‌రస్ట్ అయ్యారు.

వాస్త‌వానికి ఆదిమూలం.. సీఎం జ‌గ‌న్‌కు అత్యంత అభిమాని. కాంగ్రెస్ నుంచి నేరుగా వైసీపీలోకి వ‌చ్చారు. అలాంటి ఆదిమూలం ఇప్పుడు తీవ్ర‌స్థాయిలో ఫైర్ అయ్యారు. ఏం జ‌రిగిందంటే.. స‌త్య‌వేడు ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలాన్ని.. తిరుప‌తి పార్ల‌మెంటుకు బదిలీ చేశారు. అయితే.. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో తాను స‌రిపోన‌ని.. త‌న నియోజ‌క‌వ‌ర్గాన్ని త‌న‌కే ఇవ్వాల‌ని ఆయ‌న సీఎం జ‌గ‌న్‌ను కోరుతూ వ‌చ్చారు. కానీ, ఆయ‌న అభ్య‌ర్థ‌న‌ను ప‌ట్టించుకోకుండా.. తిరుప‌తికే వెళ్లాల‌ని ఆదేశించారు.

ఈ క్ర‌మంలో తాజాగా ఆయ‌న వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. “నేను ఎస్సీని కాబ‌ట్టి.. నా సీటును మార్చే శారు. వైసీపీలో ఎస్సీల‌కు ఎంత విలువ ఉందో నేనే ఉదాహ‌ర‌ణ‌. ఇక్క‌డ మాకుఎలాంటి వాల్యూలేదు. రెడ్డి నియోజ‌క‌వర్గాల్లో ఇలా మార్పులు చేసే ధైర్యం ఉందా? చెవిరెడ్డి, రోజారెడ్డి సీట్ల‌లో మార్పులు చేయ‌గ‌ల‌రా ?” అని ఆదిమూలం ప్ర‌శ్నించారు. త‌న‌ను నియోజ‌క‌వ‌ర్గం నుంచి మార్చ‌డానికి మంత్రి పెద్దిరెడ్డి రామ‌చం ద్రారెడ్డి కార‌ణ‌మ‌ని ఆరోపించారు. అంతేకాదు.. 1989లో డొక్కు బైకుపై, తుప్పుప‌ట్టిన బైక్ పై తిరిగిన పెద్దిరెడ్డి.. ఇప్పుడు ల‌క్ష‌ల కోట్లు ఎలా సంపాయించార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

స‌త్య‌వేడులో ఏవైనా అక్ర‌మాలు జ‌రిగి ఉంటే.. అవి పూర్తిగా పెద్దిరెడ్డి చేసిన‌వేన‌ని అన్నారు. అయితే.. రెడ్డి కాబ‌ట్టి.. ఆయ‌న‌ను వ‌దిలేసి త‌న‌ను బ‌లి చేస్త‌న్నార‌ని విమ‌ర్శించారు. స‌త్య‌వేడు ప్ర‌శాంత‌మైన నియోజ‌క వ‌ర్గ‌మ‌ని 175 సీట్ల‌లో ఇదొక్క‌టే.. వివాదాల‌కు విమ‌ర్శ‌ల‌కు దూరంగా ఉంద‌ని ఆదిమూలం అన్నారు. “న‌న్ను ఎంపీగా పంపుతున్నామ‌ని చెప్పారు. కానీ, కార‌ణం చెప్ప‌లేదు. మ‌రి నేనెందుకు వెళ్లాలి. అదే రెడ్ల విష‌యం కూడా ఇలానే చేస్తారా? ” అని ఆదిమూలం ప్ర‌శ్నించారు. కాగా, ఈయ‌న పార్టీ మారేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్న‌ట్టు తెలిసింది.