నీ చెల్లెలితో నీ గొడవ..నాకేం సంబంధం జగన్?: చంద్రబాబు

సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చలేదని, జగనే స్వయంగా చీల్చారంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలలో దుమారం రేపుతున్నాయి. అయితే, చంద్రబాబు స్క్రిప్ట్ తోనే షర్మిల మాట్లాడుతుందంటూ పరోక్షంగా జగన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే జగన్ వ్యాఖ్యలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఘాటుగా స్పందించారు.

నువ్వు, నీ చెల్లెలు కొట్టుకుంటే, ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరితే..దానికి నేను బాధ్యుడినా అంటూ చంద్రబాబు పైర్ అయ్యారు. ఆమెకు కాంగ్రెస్ పార్టీ పదవి ఇస్తే తనకేం సంబంధం అని, ఇక, షర్మిలకు స్క్రిప్ట్ కూడా తానే ఇస్తున్నా అని జగన్ ప్రచారం చేయడం హాస్యాస్పదం అని అన్నారు. ఉరవకొండలో జరిగిన ‘‘రా…కదలిరా’’ బహిరంగ సభలో జగన్ పై చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇతర పార్టీల్లో, పొరుగు రాష్ట్రంలో తనకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారంటూ జగన్ చేసిన కామెంట్లపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చేసింది తప్పని ఎవరైనా అంటే తన మనుషులని, స్టార్ క్యాంపెనర్లు అని ముద్ర వేయడం ఆయనకు అలవాటైందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. టీడీపీ-జనసేన పొత్తుతోనే వైసీపీ పతనం ప్రారంభమైందన్నారు.

పొత్తు తర్వాత వైసీపీ నేతలు తమపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఈ రాష్ట్రంలో ఎవరు ఏం మాట్లాడినా జగన్ వల్ల బాధపడ్డ వారు బయటకు వచ్చిన వారంతా తనకు స్టార్ క్యాంపెయినర్లని జగన్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలా అయితే ఈ రాష్ట్రంలో నష్టపోయిన ప్రతి ఒక్కరు తన స్టార్ క్యాంపెయినర్లేనని, ఉద్యోగం రాని యువత, పంట నష్టపోయిన రైతులు తన స్టార్ క్యాంపెనర్లు అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. 30 కోట్ల ప్రజాధనం వృథా చేసిన ఈ ముఖ్యమంత్రికి బుద్ధుందా అని చంద్రబాబు ప్రశ్నించారు.

ఆలుగడ్డకు ఉల్లిగడ్డకు తేడా తెలియని సీఎం నుంచి ఇంతకన్నా ఎక్కువ ఆశించలేమని సెటైర్లు వేశారు. ప్రతి ఏటా ఉద్యోగాల నోటిఫికేషన్ అని చెప్పి అధికారంలో నుంచి దిగిపోయే ముందు నోటిఫికేషన్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. జాబు రావాలంటే బాబు రావాల్సిందేనని, మరి బాబు రావాలంటే యువత సైకిల్ ఎక్కి కొద్దిరోజులు కష్టపడాలని పిలుపునిచ్చారు. ‘‘తమ్ముళ్లు మీకంటే నాకు ఎక్కువ ఆవేశం ఉంది…వయసు అనేది ఒక నెంబర్ మాత్రమే….మరో 20 ఏళ్లలో ఏం చేయాలని ఆలోచిస్తున్నా..2047 నాటికి ప్రపంచంలోనే తెలుగుజాతిని నెంబర్ వన్ గా నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకు పోతున్నా’’ అని చంద్రబాబు అన్నారు.