బీఆర్ఎస్ మళ్ళీ ఫోకస్ పెట్టిందా ?

తొందరలో జరగబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంపై బాగా ఫోకస్ పెట్టింది. ప్రచారానికి సోషల్ మీడియాలోని ప్రతి ప్లాట్ ఫారంను మ్యాగ్జిమమ్ ఉపయోగించుకోవాలన్నది టార్గెట్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రయత్నంచేసినా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఎందుకంటే అప్పట్లో సిట్టింగులపైన జనాల్లో ఉన్న విపరీతమైన వ్యతిరేకతే ప్రధాన కారణంగా నిలిచింది. సిట్టింగులపైన వ్యతిరేకత కారణంగా పార్టీ తరపున ఎంత పాజిటివ్ ప్రచారం చేయించినా ఉపయోగం కనబడలేదు.

ఆ విషయాన్ని కేటీయార్ ఇపుడు గుర్తుపెట్టుకున్నట్లున్నారు. అందుకనే పార్లమెంటుకు పోటీచేయబోయే అభ్యర్ధుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని నేతలు, క్యాడర్ కు హామీఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరబాట్లను పార్లమెంటు ఎన్నికల్లో రిపీట్ కానివ్వమని బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఆ ప్రకటన ఎంతవరకు ఆచరణలోకి వస్తుందో తెలీదు. అందుకనే అభ్యర్ధులు అని కాకుండా అచ్చంగా పార్టీకే ప్రధానత్య ఇస్తు పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారంలో సోషల్ మీడియాను ఉపయోగంచుకోవాలని అనుకున్నారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతి నియోజకవర్గంలోను ఒక పెద్ద బృందాన్నే ప్రచారం కోసం దింపారు. అవే బృందాలను ఇపుడు కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేయించాలని ఆలోచిస్తున్నారు. నియోజకవర్గాల్లో అప్పట్లో సోషల్ మీడియా ప్రచార బృందాలు పనిచేసిన విధానంపై పార్టీ నేతల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు కేటీయార్. ఏ నియోజకవర్గంలో అయినా సోషల్ మీడియా ప్రచారం సరిగా జరగలేదన్నా, పూర్తిగా ఫెయిల్ అయ్యిందన్న ఫీడ్ బ్యాక్ వచ్చినట్లయితే ఆ బృందాల పనితీరును సమీక్షించాలని కేటీయార్ డిసైడ్ అయ్యారు.

ఇప్పటికి డిసైడ్ చేసిందేమిటంటే అభ్యర్ధులు అనికాకుండా పార్టీ తరపున సోషల్ మీడియా ప్రచారాన్ని రంగంలోకి దింపాలని. పనిలోపనిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్లను కూడా పదేపదే ప్రస్తావించాలని అనుకున్నారు. సిక్స్ గ్యారెంటీస్ అమలుచేయటంలో ప్రభుత్వం విఫలమైందనే విషయాన్ని బాగా హైలైట్ చేయాలని కేటీయార్, హరీష్ ఇప్పటికే సోషల్ మీడియా ప్రచార బాధ్యులకు గట్టిగా చెప్పారట. కరీంనగర్ పార్లమెంటుకు చెందిన సోషల్ మీడియా వారియర్స్ తో పార్టీ ఆఫీసులో కేటీయార్ సమావేశం అవబోతున్నారు. ఈ సమావేశానికి ఏడు అసెంబ్లీల్లో గెలిచిన ఎంఎల్ఏలు, ఓడిన అభ్యర్ధులతో పాటు సీనియర్ నేతలను కూడా ఆహ్వానించారు. సమావేశంలో ఏమి చెబుతారో చూడాలి.