విమ‌ర్శ‌లు లేవు.. పోలిటిక‌ల్ గేర్ మార్చేసిన జ‌గ‌న్‌…!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని వ‌రుస‌గా రెండో సారి కూడా విజ‌యం ద‌క్కించుకోవాల‌ని ఉవ్వి ళ్లూరుతున్న వైసీపీ.. దానికి అనుగుణంగా పొలిటిక‌ల్ గేర్ మార్చే ప‌నిలో ప‌డింది. తాజాగా .. వైసీపీ కీల‌క నేత‌ల‌కు సీఎం జ‌గ‌న్ కొన్ని సూచ‌న‌లు చేశారు. “నేను రెడీ.. మీరు రెడీనా?” అని ఆయ‌న అడిగిన‌ట్టు తెలిసింది. అయితే.. నాయ‌కులు మాత్రం ముఖ‌ముఖాలు చూసుకున్నార‌ట‌. దీనికి కార‌ణం.. ఎన్నిక‌ల‌కు సంబంధించి ప్ర‌తిప‌క్షాల‌ను టార్గెట్ చేసే అంశంపై వారు ప్రిపేర్ కాక‌పోవ‌డ‌మేన‌ని తెలిసింది.

ఈ విష‌యాన్ని కూడా సీఎం జ‌గ‌న్ ప్ర‌స్తావించారు. “ప్ర‌తిప‌క్షాల‌ను టార్గెట్ చేస్తే.. మ‌న‌కు ఏమొస్తుంది. ఇది ఎప్పుడూ ఉండేదే. ఇది వ‌ద్దు. మ‌నం మ‌న స్ట‌యిల్ మారుస్తున్నాం. అంద‌రిలాగా కాకుండా.. ఈ నాలుగేళ్ల‌లో మ‌నం ఏం చేశామో.. ప్ర‌జ‌ల‌కు వివ‌రిద్దాం. గ‌త ప్ర‌భుత్వంతో పోలిక పెడుతూ.. ప్ర‌జ‌ల‌ను ఆలోచించుకునేలా చేద్దాం. అలా ప్లాన్ చేయండి” అని సీఎం జ‌గ‌న్‌దిశానిర్దేశం చేసిన‌ట్టు తెలిసింది. ఈ విష‌యాన్ని కొంత లోతుగా ప‌రిశీలిస్తే.. ఇటీవ‌ల విజయ‌వాడలో అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన ద‌రిమిలా.. సీఎం జ‌గ‌న్‌చేసిన ప్ర‌సంగం ఇలానే సాగింది.

విజ‌య‌వాడ స‌భ‌లో జ‌గ‌న్ చేసిన ప్ర‌సంగాన్ని గ‌మ‌నిస్తే.. ఆయ‌న గ‌తానికి భిన్నంగా ప్ర‌సంగించారు. ఎక్కడా టీడీపీని కానీ, చంద్ర‌బాబు ను కానీ, జ‌న‌సేన‌ను కానీ.. ఆయ‌న తిట్టి పోయ‌లేదు. విమ‌ర్శించ‌ను కూడా చేయ‌లేదు. కేవ‌లం తాను ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలు, అమ‌లు చేస్తున్న సంక్షేమం వంటి కీల‌క అంశాల‌ను మాత్ర‌మే ప్ర‌స్తావించారు. ఈ ప‌థ‌కాలు, ఈ సంక్షేమం గ‌త ప్ర‌భుత్వం ఎందుకు అమ‌లు చేయ‌లేదు? అని నిల‌దీశారు. ఈ క్ర‌మంలో ఆయా ప‌థ‌కాల పేర్ల‌ను ఎక్స్‌ప్రెస్ వేగంతో జ‌గ‌న్ చెప్పుకొచ్చారు.

ఈ త‌ర‌హా ప్ర‌చారం.. మార్పును సూచించింద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి దీనికి మ‌రింత ప‌దును పెంచి.. తారీఖులు, ద‌స్తావేజుల‌తో స‌హా.. కంపేరిజ‌న్ పెట్టే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని అంచ‌నా వేశారు. వీరి అంచ‌నాకు త‌గిన విధంగానే సీఎం జ‌గ‌న్ కూడా ప్ర‌చార స‌ర‌ళిని మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఒక‌రిపై ఒక‌రు తిట్టుకునే రాజ‌కీయంతో చేటే త‌ప్ప‌.. మ‌రేమీ రాద‌ని.. పైగా మేధావులు కూడా దూర‌మ‌వుతార‌ని ఆయ‌న భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే కంపేరిజ‌న్ పాలిటిక్స్‌కు పెద్ద‌పీట వేయ‌డంద్వారా అంద‌రినీ ఆలోచ‌న దిశ‌గా న‌డిపించి మెప్పు పొందాల‌ని జ‌గ‌న్‌నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. మేం ఇది చేశాం.. మ‌రోసారి గెలిస్తే.. ఇలా చేస్తాం.. అని చెప్పుకొనేందుకు జ‌గ‌న్ ప్రాధాన్యం ఇచ్చి.. విప‌క్షాల‌ను ఇర‌కాటంలోకి నెట్టే ప్ర‌య‌త్నం చేయ‌నున్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఈ మార్పు మంచిదేన‌ని అంటున్నారు. మేధావుల‌ను కూడా వైసీపీ విష‌యంలో ఆలోచించేలా చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.