దావోస్ పర్యటన సక్సెస్ అయినట్లేనా ?

మూడు రోజుల రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన పూర్తయ్యింది. అంతర్జాతీయ పెట్టుబడుల సమావేశాలు ప్రతి ఏడాది స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతాయని అందరికీ తెలిసిందే. ఆ సమావేశాలకే రేవంత్ తన బృందంతో హాజరయ్యారు. ప్రభుత్వ వర్గాల ప్రకారం తన పర్యటనలో ప్రభుత్వం తరపున రేవంత్ రు. 40,232 కోట్ల విలువైన ఎంవోయూలు చేసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇపుడు జరిగిన ఎంవోయూలే అత్యధిక ఒప్పందాలని చెప్పుకోవాలి. పదేళ్ళల్లో తెలంగాణా ప్రభుత్వం తరపున మంత్రిగా కేటీయార్ దావోస్ వెళ్ళినా ఇంత పెద్దఎత్తున ఎంవోయూలు జరగలేదు.

200 కంపెనీల ప్రతినిధులతో రేవంత్ బృందం అనేక భేటీలు జరిపింది. దాని ఫలితమే పై ఒప్పందాలు. ఎంవోయూలు చేసుకున్న కంపెనీల్లో ఎక్కువగా ఇండియన్ కంపెనీలు ఉన్నాయిన వీటిల్లో కూడా అదాని గ్రూపు రు. 12,400 కోట్లు, జిందాల్ స్టీల్స్ రు. 9 వేల కోట్లు, గోడి ఇండియా రు. 8 వేల కోట్లు, వెబ్ వర్క్స్ రు. 5200 కోట్లు, అరెజాన్ లైఫ్ సైన్సెస్ రు. 2 వేల కోట్లు, గోద్రెజ్ రు. 1270 కోట్లు, టాటా గ్రూప్ రు. 1500 కోట్లు, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ రు. 231 కోట్ల మేర ఒప్పందాలు చేసుకున్నాయి.

ఎంవోయులు చేసుకోవటం వరకు ఘనంగానే కనిపిస్తున్నాయి. ఈ ఘనమంతా ప్రచారం చేసుకోవటానికి మాత్రమే పనికొస్తాయి. వాస్తవ రూపం దాల్చితేనే రాష్ట్రానికి ఉపయోగం అని అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎంవోయులు చేసుకునే కంపెనీలన్నీ తర్వాత పెట్టుబడులపై ఆసక్తిని చూపించవు. ఏవో ప్రచారం కోసం కంపెనీలు హడావుడి చేస్తాయి. ఎంవోయులన్నీ వాస్తవరూపం దాల్చవన్న విషయం ప్రభుత్వానికి కంపెనీలకు కూడా బాగా తెలుసు.

ఎంవోయూలన్నీ వాస్తవరూపం దాల్చాలంటే అందుకు ఇటు ప్రభుత్వం అటు కంపెనీల్లో చిత్తశుద్ది అవసరం. ఎంవోయులు కుదుర్చుకున్న కంపెనీలతో ప్రభుత్వం వైపు నుండి ఫాలోప్ చాలా అవసరం. నిరంతరం కంపెనీల వెంటపడుతుంటే అప్పుడు యాజమాన్యాలు పెట్టుబడులు పెట్టే విషయమై సీరియస్ గా ఆలోచిస్తాయి. లేకపోతే ఎంవోయుల ప్రచారం ఉత్త ప్రచారంగా మాత్రమే ఉండిపోతాయి.