రెండు సీట్లపై రేవంత్ ప్రత్యేకంగా గురిపెట్టారా?

తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో అన్నీ సీట్లను స్వీప్ చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ టార్గెట్. ఇందులో భాగంగానే రెండుసీట్లపైన రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన దృష్టిపెట్టారట. ఇంతకీ ఆ రెండు సీట్లు ఏవంటే మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు నియోజకవర్గాలు. ఈ రెండు సీట్లపైనే రేవంత్ ఎందుకింత ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు ? ఎందుకంటే ఇవి రెండు రేవంత్ సొంత జిల్లాలోని రిజర్వుడు నియోజకవర్గాలు కావటమే కారణం. రేవంత్ ది మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్ అని అందరికీ తెలిసిందే.

ఇపుడు ఈ రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందుకనే తన జిల్లాలోని రెండు సీట్లను కచ్చితంగా గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇక్కడ మరో కారణం ఏమిటంటే మొన్నటి అసెంబ్లీ నియోజవర్గాల్లో కాంగ్రెస్ మ్యాగ్జిమమ్ స్వీప్ చేసేసింది. జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 12 చోట్ల హస్తంపార్టీ అభ్యర్ధులే గెలిచారు. కొంచెం కష్టపడుంటే మిగిలిన రెండు నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్సే గెలిచుండేదని రిపోర్టు వచ్చింది. అందుకనే సీడ్బ్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడైన వంశీచంద్ రెడ్డితో రేవంత్ ఢిల్లీలో భేటీ అయ్యారు.

తొందరలోనే జిల్లాకు వచ్చి అన్నీ నియోజకవర్గాలపైన అక్కడే రివ్యూ చేస్తానని వంశీకి రేవంత్ చెప్పారట.  పార్లమెంటు అభ్యర్ధుల ఎంపిక, ఇప్పటికిప్పుడు భర్తీ చేయాల్సిన రెండు ఎంఎల్సీ స్ధానాల్లో ఎంపిక చేయాల్సిన అభ్యర్ధులపైన చర్చించేందుకు రేవంత్ ఢిల్లీలో క్యాంపువేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది సీట్లను గెలుచుకున్నది. బీజేపీ నాలుగు చోట్ల, కాంగ్రెస్ మూడు సీట్లు గెలిచింది. హైదరాబాద్ సీటును ఎంఐఎం గెలుచుకున్నది.

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ మినహా మిగిలిన 16 సీట్లను కాంగ్రెస్ గెలుచుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నది. అందుకనే ప్రతి నియోజకవర్గంపైన ఒకటికి రెండుమూడుసార్లు సర్వేలు చేయించుకుంటోంది. వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో రేవంత్, సునీల్ భేటీ అయ్యారు. మొత్తానికి  పార్లమెంటు ఎన్నికల్లో గెలుపుకు రేవంత్ గట్టిగానే టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.