మోడీ వ్యూహాన్ని ఊహించ‌ని కాంగ్రెస్‌.. బిగ్ షాక్‌!!

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారును గ‌ద్దె దింపి.. అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి షాకుల మీద షాకులు త‌గులు తున్నాయి. ఇండియా కూట‌మిలో లుక‌లుక‌లు కొన‌సాగుతుండ‌డం ఒక త‌ల‌నొప్పిగా మారితే.. మ‌రోవైపు కీల‌క నేత‌ల‌ను బీజేపీ లాగేస్తోంది. ఇదంతా మోడీ వ్యూహ‌మేన‌ని చెబుతున్న కాంగ్రెస్‌.. దీనికి అడ్డుక‌ట్ట మాత్రం వేయ‌లేక పోతోంది.

తాజాగా జ‌రిగిన రెండు ఘ‌ట‌న‌లు కాంగ్రెస్‌ను ఇర‌కాటంలోకి నెట్టాయి. ఒక‌టి.. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ  భార‌త్ జోడో న్యాయ యాత్ర‌ను ప్రారంభించ‌డానికి ముందు మ‌హారాష్ట్రలో సంచ‌ల‌నం చోటు చేసుకుంది. దాదాపు 56 సంవ‌త్స‌రాల సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకుని.. మిలింద్ దేవ‌రా.. కాంగ్రెస్‌కు రిజైన్ చేశారు. వాస్త‌వానికి .. ఈ ఏడాది చివ‌రిలో మ‌హారాష్ట్ర ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇక్క‌డ బ‌ల‌ప‌డాల‌ని.. గ‌త ఏడాది కాలంగా ఇక్క‌డ ముసురుకున్న రాజ‌కీయ అనిశ్చితి త‌మ‌కు లాభిస్తుంద‌ని కాంగ్రెస్ అంచ‌నా వేసింది.

అయితే.. కీల‌క నేత‌, మాజీ ఎంపీ మిలింద్ దేవ్‌రాను.. వ్యూహాత్మ‌కంగా బీజేపీ శివ‌సేన లోకి తీసుకుంది. మిలింద్‌కు ముంబై ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గం టికెట్‌ను ఇచ్చేందుకు సీఎం షిండే నేతృత్వంలోని శివ‌సేన రెడీ అయింది. ఇది కాంగ్రెస్‌కు ముంబైలో శ‌రాఘాతంగా మారింది. ఇక‌, రెండోది.. అత్యంత కీల‌క‌మైంది.. ఇండియా కూట‌మి నుంచి బిహార్ అధికార పార్టీ ఆర్జేడీ బ‌య‌ట‌కు వ‌చ్చేసేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ఇది కూడా మోడీ వ్యూహ‌మేన‌ని కాంగ్రెస్ చెబుతోంది.

ప్ర‌స్తుతం ఇండియా కూట‌మికి చైర్మ‌న్‌గా కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గేను ఇత‌ర ఇండియా కూట‌మి పార్టీలు ఎంచుకున్న ద‌రిమిలా నితీష్ త‌న అభిప్రాయం మార్చుకున్నారు. దీంతో ఆయ‌న గ‌త రెండు రోజులుగా ఇండియా కూట‌మి పార్టీల‌కు దూరంగా ఉంటున్నారు. తాజాగా రాహుల్ ప్రారంభించిన న్యాయ యాత్ర‌కు కూడా బిహార్ నేత‌లు దూరంగా ఉన్నారు. ఈ ప‌రిణామాల వెనుక మోడీ ఉన్నార‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంద‌ని కాంగ్రెస్ చెబుతోంది. అయిన‌ప్ప‌టికీ.. ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డడం గ‌మ‌నార్హం. మ‌రి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఎలా ముందుకు సాగుతుందో చూడాలి.