బీఆర్ఎస్ జీవోలకు బ్రేకులు

ఎన్నికలకు ముందు కేసీయార్ హడావుడిగా చాలా ఉత్తర్వులు ఇచ్చారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు లేదని తెలిసి కూడా కేసీయార్ ఆదేశాల మేరకు ప్రభుత్వం అప్పట్లో చాలా జీవోలను జారీచేసింది. ఇపుడు అలాంటి జీవోలన్నింటిని రేవంత్ రెడ్డి నిలుపేశారు. ఎన్నికల ముందు కేసీయార్ ఆదేశాలతో జారీ అయిన జీవోలన్నింటినీ హోల్డులో పెట్టాలని రేవంత్ చీఫ్ సెకట్రరీకి ఆదేశాలిచ్చినట్లు సమాచారం. జీవోల ద్వారా పరిపాలనా అనుమతులతో మొదలైన పనులను కూడా హోల్డులో పెట్టమని చెప్పారట.

ఎందుకంటే అసలు ఎలాంటి పనులకు కేసీయార్ హడావుడిగా జీవోలు జారిచేయించారనే విషయాలపై రివ్యూలు చేయాలని రేవంత్ నిర్ణయించారు. గ్రౌండ్ అయిన పనులేమిటి ? ఇంకా మొదలుకాని పనులేమిటి ? పరిపాలనా అనుమతుల మంజూరు దశల్లో ఉన్న పనులెన్ని అన్న మూడు క్లాసిఫికేషన్లతో రేవంత్ సమీక్షలు జరపాలని డిసైడ్ అయ్యారట. అలాగే ఎన్నికలకు ముందు వివిధ కాంట్రాక్టు పనులకు సంబంధించిన బిల్లులను కూడా చెల్లించవద్దని చెప్పారట.

ఎందుకంటే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీయార్ చాలా పనులను నామినేషన్ల మీద కేటాయించేశారట. అలా కాంట్రాక్టులు అందుకున్నవారంతా బీఆర్ఎస్ నేతలు లేదా నేతల కుటుంబీకులే అని ప్రచారం జరుగుతోంది. తమ వాళ్ళకి ఆర్ధికలబ్ది జరగాలన్న ఉద్దేశ్యంతోనే కేసీయార్ హడావుడిగా ఆదేశాలు జారిచేసినట్లు ఆరోపణలున్నాయి. అందుకనే అలాంటి హడావుడి జీవోలన్నింటని నిలిపేయాలని రేవంత్ ఆదేశాలిచ్చింది. అధికారుల సమాచారం ప్రకారం స్పెషల్ ఫండ్స్ పేరుతో కేసీయార్ సుమారు రు. 4 వేల కోట్ల విలువైన పనులను కేటాయించారట. వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు అందుకున్న వారిలో అత్యధికులు బీఆర్ఎస్ నేతలు లేదా వాళ్ళకు సంబంధించిన వాళ్ళేనని అర్ధమైందట.

ఇప్పటికే పదేళ్ళ పాలనలో జరిగినభారీ అవినీతి బయటపడుతోందని మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పదేపదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తమ ఆరోపణలకు కాళేశ్వరంలో వేల కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయని, మేడిగడ్డ నాసిరకం నిర్మాణాన్ని, విద్యుత్ శాఖలోని 85 వేల కోట్ల రూపాయల అప్పులను చూపిస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకునే హడావుడి జీవోలన్నింటినీ రేవంత్ ఆపేసినట్లున్నారు.