వైసీపీ వ్యూహం… రాజ‌కీయ మేధావుల‌కు సైతం మైండ్ బ్లాంక్‌

“వైసీపీ అంటే కేవ‌లం పార్టీనే కాదు.. అదొక సోష‌ల్ ఇంజ‌నీరింగ్ డిపార్ట్‌మెంట్ బ్రో!!”- అంటున్నారు రాజ కీయ మేధావులు. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను ఎలాంటి శ‌ష‌భిష‌లు లేకుం డా.. వ్యూహాత్మ‌కంగా స్థానాలు మార్చేసిన తీరు.. రాజ‌కీయంగా సంచ‌ల‌నాల‌కు వేదిక అయింది.  ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించిన స్థానాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి.

నిజానికి ఇంత పెద్ద స్థాయిలో మార్పులు ఉంటాయ‌ని.. వైసీపీనేత‌లు కూడా ఊహించ‌లేదు. తొలిసారి 11, త‌ర్వాత 24, ఇప్పుడు 21 స్థానాల‌కు సంబంధించి ఇంచార్జ్‌ల‌ను మార్పు, చేర్పులు చేయ‌డం.. కీల‌క‌మైన ఓసీ స్థానాల‌కు కూడా బీసీ, మైనారిటీ నేత‌ల‌కు అప్ప‌గించ‌డం.. కొత్త ముఖాల‌ను ప‌రిచ‌యం చేయ‌డం వంటివి వైసీపీ రాజ‌కీయాల‌కు హైలెట్‌గా నిలిచాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు 50+ స్తానాల్లో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి.

అయితే.. మ‌రిన్ని స్థానాల్లోనూ మార్పులు ఉంటాయ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇచ్ఛాపు రంలో చేసిన మార్పు.. అత్యంత అనూహ్యంగా ఉంద‌నే చెబుతున్నారు ప‌రిశీల‌కులు. అదేవిధంగా రాయ దుర్గం, మ‌ద‌న‌ప‌ల్లె, ఏలూరు పార్ల‌మెంటు స్థానాల్లో మార్పుల‌ను గ‌తంలో ఎవ‌రూ ఊహించ‌లేదు. ఇది చాలా వ్యూహాత్మ‌కంగా జ‌రిగిన మార్పుగానే చెబుతున్నారు. పైగా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యాన్ని ద‌క్కించు కుని తీరాల‌ని నిర్ణ‌యించుకున్న వైసీపీ.. ఇలా సంచ‌ల‌నాల‌కు వేదిక కావ‌డం గ‌మ‌నార్హం.

ఇప్పుడున్న లెక్క‌ల ప్ర‌కారం.. తాజా జాబితాలో ఇద్ద‌రు బీసీ మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట వేశారు. మొత్తంగా చూస్తే.. సోష‌ల్ ఇంజ‌నీరింగ్ దిశ‌గా వైసీపీ అడుగులు వేసింది. ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మయం ఉండ‌డం.. రాజ‌కీయంగా కొత్త‌నేత‌ల‌కు అవ‌కాశం క‌ల్పించ‌డం.. జెడ్పీ చైర్మ‌న్‌ల‌ను తీసుకువ‌చ్చి అసెంబ్లీ బ‌రిలో నిల‌బెట్ట‌డం.. అనూహ్యంగా అసెంబ్లీ స్థానాల‌కు ఎంపీల‌ను నిల‌బెట్ట‌డం.. వంటి ప‌రిణామాలు.. వైసీపీ సామాజిక కోణంలో చేసిన‌ట్టుగానే చ‌ర్చ సాగుతోంది. రాజ‌కీయంగానే కాకుండా.. సోష‌ల్ ఇంజ‌నీరింగ్ లోనూ.. వైసీపీని భిన్న‌మైన పొలిటిక‌ల్ పార్టీగా నిల‌బెడుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.