జ‌గ‌న్‌.. భ‌స్మాసురుడు: చంద్ర‌బాబు

ఏపీకి భ‌స్మాసురుడు ఎవ‌రైనా ఉన్నారంటే.. అది జ‌గ‌నేన‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు అన్నారు. మంగళ‌వారం రాత్రి నంద్యాల జిల్లాలో నిర్వ‌హించిన రా.. క‌ద‌లిరా! స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. ఐదేళ్ల వైసీపీ పాల‌న‌లో సీమ జిల్లాలు నీరు లేక అల‌మ‌టించిపోతున్నాయ‌న్నారు. ఇదే జిల్లాల‌కు చెందిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. క‌నీసం ఇక్క‌డి వారిని ఆదుకోవాలన్న స్పృహ కూడా లేకుండా వ్య‌వ‌హ‌రిస్త‌న్నార‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు.

“ఎక్కడ చూసినా విధ్వంస పాలన. రాష్ట్రానికి మళ్లీ స్వర్ణయుగం రావాలి. స్వర్ణ యుగం కోసం నాతో వస్తారా? అనర్హులను అందలం ఎక్కించి అనేక బాధలు పడుతున్నాం. భస్మాసురుడి లాంటి నేతను తెచ్చుకొని అనేక కష్టాలు పడుతున్నాం.” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే జ‌గ‌న్ గురించి తాను చెప్పాన‌ని అప్ప‌ట్లో త‌న మాట‌లు విని ఉంటే.. రాష్ట్రం ప‌రిస్థితి, ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఇలా ఉండేదా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

నంద్యాల జిల్లాలో రెడ్డి సామాజిక వ‌ర్గం ఎమ్మెల్యేలు దోచుకుంటున్నార‌ని.. కానీ, అమాయ‌కులైన ఆర్థ‌ర్ వంటి వారిని ప‌క్క‌న పెడుతూ.. దోచుకుంటున్న వారిని ప్రోత్స‌హిస్తున్నార‌ని విమ‌ర్శించారు. మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే.. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గ‌మైన నందికొట్కూరుకు రూ.650 కోట్లతో మెగా సీడ్‌ పార్క్‌ తేవాలనుకున్నామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్‌ పార్కును అటకెక్కించార‌ని వ్యాఖ్యానించారు.

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా అలగనూరుకు మరమ్మతులు చేస్తామ‌ని చంద్ర‌బాబు ఈ సంద‌ర్భంగా జిల్లా ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చారు. ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్ ఇస్తాన‌న్న ఈ ముఖ్య‌మంత్రి ఒక్క‌సారైన ఇచ్చారా? అని నిల‌దీశారు. వైసీపీ ప్రభుత్వ వేధింపులతో అమరరాజా, జాకీ వంటి ప్ర‌తిష్టాత్మ‌క కంపెనీలు వెనక్కి వెళ్లిపోయాయని అన్నారు. జగన్‌ మాయమాటలు నమ్మి మరోసారి మోసపోవ‌ద్ద‌ని టీడీపీని ఆద‌రించాల‌న చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.