బాలయ్య‌కు లైన్ క్లియ‌ర్ చేస్తున్న వైసీపీ…!

టీడీపీ నాయ‌కుడు, న‌ట‌సింహం, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణకు వైసీపీ లైన్ క్లియ‌ర్ చేస్తోందా? ఆయ‌న‌కు మ‌రింత మెజారిటీ ద‌క్క‌డం ఖాయంగా క‌నిపిస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ(2014, 2019) బాల‌య్య హిందూపురం నుంచి విజ‌యం ద‌క్కించుకుంటున్నారు. ఈ ద‌ఫా ఇక్క‌డ ఆయ‌న‌ను ఓడించాల‌ని వైసీపీ భావించింది. అయితే.. అంత‌ర్గ‌త‌కుమ్ములాట‌లు, వైసీపీ నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య ధోర‌ణి కార‌ణంగా.. ఇక్క‌డ స‌రైన నాయ‌కుడు వైసీపీకి క‌నిపించ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇక్క‌డ నుంచి ఎవ‌రు పోటీ చేస్తార‌నేవిష‌యంపై వైసీపీ త‌ర్జ‌న భ‌ర్జ‌న పడుతూ వ‌చ్చింది.

తాజాగా ఇక్క‌డ ప‌ర్య‌టించిన మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఈ ద‌ఫా వైసీపీ బీసీ మ‌హిళ‌కు టికెట్ కేటాయించే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న చెప్పారు. బాల‌య్య హ‌వాను ఆయ‌న గాజు మేడ‌గా పేర్కొన్నారు. ఆయ‌న హ‌వా ఏమీలేద‌ని.. ఉన్నా అది గాజు మేడ‌గా అభివ‌ర్ణించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి వైసీపీ బీసీ మ‌హిళ‌కు ప్రాధాన్యం ఇస్తుంద‌న్నారు. ఆమె ను గెలిపించుకుని తీరుతామ‌ని కూడా చెప్పారు. అయితే.. బీసీ మ‌హిళ‌ను ఇప్ప‌టికిప్పుడు వైసీపీ ఏరికోరి తెచ్చినా.. టికెట్ ఆశించిన న‌వీన్ నిశ్చ‌ల్ వంటివారు మ‌రోసారి స‌హ‌క‌రించే అవ‌కాశం లేదు.

ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ ఓడిపోయి ఇక్బాల్ నుంచి ఆశించిన మేర‌కు స‌హ‌కారం ఉండే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. దీంతో ఈ ద‌ఫా ఎన్నిక‌ల పోలింగ్ ఏక‌ప‌క్షంగా సాగినా ఆశ్చ‌ర్యం లేద‌ని టీడీపీనాయ‌కులు చెబుతున్నారు. బాల‌య్య ప్ర‌త్య‌క్షంగా నిత్యం అందుబాటులో లేక‌పోయినా.. ఆయ‌న చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు నిర్విఘ్నంగా కొన‌సాగుతున్నాయ‌ని వారు చెబుతున్నారు. రూ.5 కే ఎన్టీఆర్ క్యాంటీన్ల ద్వారా మొబైల్ వాహ‌నాల‌తో భోజ‌నాలు.. వైద్యం.. ఉచిత విద్య వంటివి కొన‌సాగుతున్నాయ‌ని చెబుతున్నారు. త‌ర‌చుగా బాల‌య్య స‌తీమ‌ణి వ‌సుంధ‌ర కూడా ఇక్క‌డ ప‌ర్య‌టిస్తున్న విష‌యాన్ని వారు ప్ర‌స్తావిస్తున్నారు.

ఇక‌, సేవ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. రాజ‌కీయంగా బాల‌య్య‌కు ఇక్క‌డ తిరుగులేద‌ని అంటున్నారు. హిందూపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాల‌న్న స్థానికుల ఉద్య‌మానికి బాల‌య్య మ‌ద్ద‌తు ఇచ్చిన విష‌యాన్ని వారు ప్ర‌స్తావిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్ర‌స్తుతం ఉన్న స‌త్య‌సాయి జిల్లా కేంద్రాన్ని మారుస్తామ‌ని బాల‌య్య చెప్పార‌ని.. ఈ డిమాండ్ ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల్లో స‌జీవంగానే ఉంద‌ని అంటున్నారు. ఇక‌, వైసీపీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లుఉన్న‌ట్టుగా టీడీపీలో లేక‌పోవ‌డాన్ని కూడా వారు ప్ర‌స్తావిస్తున్నారు. ఇలా..ఏవిధంగా చూసుకున్నా.. వైసీపీ నిర్ణ‌యం బాల‌య్య‌కు మ‌రింత‌గా లైన్ క్లియ‌ర్ చేస్తుంద‌ని అంటున్నారు.