వైసీపీ ఎంపీ చంద్రబాబుతో భేటీ అయ్యారా ?

వైసీపీ నెల్లూరు జిల్లాలో కీలకపరిణామం చోటుచేసుకున్నదా ? అవుననే సమాధానం వినిపిస్తోంది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఈమధ్యనే చంద్రబాబునాయుడుతో భేటి అయినట్లు సమాచారం. వైసీపీ తరపున నెల్లూరు ఎంపీగా పోటీచేయమని జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డిని అడిగారట. ఇపుడు రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డిని రాబోయే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో నెల్లూరు నుండి పోటీచేయించాలన్నది జగన్ ఆలోచన. అందుకు వేమిరెడ్డి కూడా అంగీకరించారు. అయితే ఒక షరతు విధించారట.

అదేమిటంటే నెల్లూరు సిటి, కావలి, ఉదయగిరి ఎంఎల్ఏ అభ్యర్ధులను మార్చాలని. పై నియోజకవర్గాల్లోని అభ్యర్ధులపై వ్యతిరేకత ఉందని కాబట్టి వాళ్ళని మార్చకపోతే తన గెలుపుపై ప్రభావం చూపుతుందని వేమిరెడ్డి జగన్ తో చెప్పారట. అయితే వాళ్ళని మార్చటానికి జగన్ అంగీకరించలేదు. మార్పులు లేకుండానే ఎంపీగా పోటీచేయాలని వేమిరెడ్డికి జగన్ స్పష్టంచేసినట్లు పార్టీవర్గాల సమాచారం. దాంతో వేమిరెడ్డిలో తీవ్ర అసంతృప్తి మొదలైందట. అందుకనే రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీగా పోటీచేయటానికి ఇష్టపడటంలేదట.

అందుకనే పార్టీ మారి ఎంపీగా టీడీపీ తరపున పోటీచేయాలని అనుకుంటున్నట్లు పార్టీలో టాక్ మొదలైంది. ఈ నేపధ్యంలోనే చంద్రబాబుతో వేమిరెడ్డి భేటీ అయినట్లు తెలుస్తోంది. వేమిరెడ్డిని పార్టీలోకి తీసుకుని ఎంపీ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు కూడా సుముఖంగానే ఉన్నారట. కాబట్టి అన్నీ కుదిరితే సంక్రాంతికి జగన్ కు వేమిరెడ్డి పెద్ద కానుక ఇవ్వటం ఖాయమే అని అంటున్నారు. వేమిరెడ్డి గనుక టీడీపీలో చేరితే జిల్లాలో సమీకరణలు అన్నీ మారిపోవటం ఖాయం.

జిల్లా వ్యాప్తంగా వేమిరెడ్డికి మద్దతుదారులున్నారు. అలాగే ఆర్ధికంగా అత్యంత పటిష్టంగా ఉన్నారు. కాబట్టి వేమిరెడ్డి టీడీపీలో చేరటం కరెక్టే అయితే వైసీపీకి పెద్ద నష్టం జరిగే అవకాశాలున్నాయి. మరీ విషయాలు, సమీకరణలు, గ్రౌండ్ రిపోర్టు జగన్ కు తెలీకుండానే ఉంటుందా ? వేమిరెడ్డిని కన్వీన్స్ చేయటానికి జగన్ ప్రయత్నించలేదా ? లేకపోతే జగన్ ప్రయత్నించినా ఎంపీ సరేమిరా అన్నారా అన్నదే అర్ధంకావటంలేదు. ఏదేమైనా రాబోయే ఎన్నికలు వైసీపీకి చాలా కీలకమైనదన్నవిషయం అందరికీ తెలిసిందే. మరి ఏమి జరుగుతుందో చూడాలి.