ఆ స్కీం వెనుక భారీ స్కాం – పవన్

ఏపీ సీఎం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌చ్చి.. అమ‌లు చేస్తున్న కార్య‌క్ర‌మం(ప‌థ‌కం) ‘స‌మ‌గ్ర భూర‌క్ష‌’. ఎప్పుడో ద‌శాబ్దాలుగా ఉన్న భూమి స‌మ‌స్య‌ల‌కు ఈ కార్య‌క్ర‌మం ద్వారా ప‌రిష్కారం చూపించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నారు. ఇది గ్రామీణ స్థాయిలో ప్ర‌జ‌ల‌కు ల‌భించిన ఒక వ‌ర‌మ‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. అయితే.. తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‘భూర‌క్ష‌’ ప‌థ‌కంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ‘భూర‌క్ష‌’ ప‌థ‌కాన్ని కేవ‌లం దోచుకున్న భూముల‌ను దాచుకునేందుకు మాత్ర‌మే జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చింద‌ని విమ‌ర్శించారు.

సమగ్ర భూరక్ష చట్టం వల్ల న్యాయవాదులకు అనేక ఇబ్బందులు వస్తాయని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. “నా భూమిపై నీకు హక్కేంటి” అనేది ఇక్కడి సమస్యగా ఉంద‌న్నారు. ఈ చట్టం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. రెవెన్యూ అధికారుల సాయంతో ఆస్తులు దోచుకోవచ్చున‌ని, కోర్టు నుంచి న్యాయరక్షణ పొందవచ్చున‌ని తెలిపారు. “విశాఖలో దోచుకున్న ఆస్తులను చట్టబద్ధం చేసుకునేందుకే దీన్ని తీసుకొచ్చారా? ఇలాంటి వాటి ద్వారా రుషికొండను దోచుకొని నచ్చిన వారికి రాసుకోవచ్చు. సమగ్ర భూరక్ష చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం” అని ప‌వ‌న్ నిప్పులు చెరిగారు.

తాజాగా మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన కేంద్ర కార్యాల‌యంలో గుంటూరు, విజయవాడ బార్‌ అసోసియేషన్‌ల న్యాయవాదులు పవన్‌ కల్యాణ్‌ను కలిశారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ సర్కారు తీసుకువ‌చ్చిన‌.. ‘సమగ్ర భూరక్ష’ చట్టంలో లోపాలపై పవన్ వారితో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టంపై ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవాదుల పోరాటానికి జనసేన మద్దతుగా ఉంటుందని పవన్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ మీడియాతో మాట్లాడుతూ.. సమగ్ర భూరక్షలో.. కోర్టుల మధ్యవర్తిత్వాన్ని తీసేశారని అన్నారు. ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు దారి తీస్తుందన్నారు.

“అసలు ఆస్తి పత్రాలపై జగన్‌ బొమ్మ ఉండటం ఏంటి? రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల నుంచి న్యాయవాదుల వరకు ఉద్యమాలు చేసే పరిస్థితి వచ్చింది. సమగ్ర భూరక్షకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న న్యాయవాదులకు సంపూర్ణ మద్దతు ఇస్తా. సగటు మనిషికి సులువుగా అర్థమయ్యేలా ఈ అంశంపై మరింత అధ్యయనం చేస్తా. అందరికీ అర్థమయ్యేలా చెప్పేందుకు కొంత స‌మ‌యం తీసుకుంటా” అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్యానించారు. మ‌రి దీనిపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.