వైసీపీకి మల్లాది విష్ణు గుడ్ బై?

వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాలను మారుస్తూ సీఎం జగన్ నిన్న రెండో జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలలో కొందరు అసంతృప్తితో ఉన్నారు. కొందరు సర్దుకుని పార్టీలోనే కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంకొందరు నేతలు పార్టీని వీడెందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణును విజయవాడ వెస్ట్ కు మారుస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు.

విజయవాడ వెస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జిగా జగన్ నియమించారు. అయితే, ఈ నిర్ణయంతో సంతృప్తిగా లేని మల్లాది విష్ణు సైలెంట్ గా ఉన్నారు. దీంతో, ఆయనను కలిసేందుకు వెల్లంపల్లి స్వయంగా మల్లాది విష్ణు ఇంటికి వెళ్లారు. అయితే, వెల్లంపల్లితో ముక్తసరిగా విష్ణు మాట్లాడడంతో ఆ భేటీ 15 నిమిషాల పాటే సాగింది. దీంతో, వెల్లంపల్లి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే మల్లాది విష్ణు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతుంది.

షర్మిల వెంట నడిచేందుకు విష్ణు ప్రయత్నిస్తున్నట్టుగా బెజవాడ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ రోజు తన అనుచరులు, కార్పొరేటర్లతో మల్లాది విష్ణు పలుమార్లు భేటీ అయ్యారు. రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేస్తానని తేల్చి చెప్పిన విష్ణుకు…వైసీపీ అధిష్టానం నుంచి స్పందన సరిగా లేకపోవడంతో కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. ఆల్రెడీ వైఎస్ షర్మిల తో విష్ణు టచ్ లో ఉన్నారని, తనకు అన్యాయం జరిగిందన్న ఆవేదనలో ఆయన ఉన్నారని తెలుస్తోంది. ఇక, తాజాగా విష్ణు తో మాట్లాడేందుకు వైసీపీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆయన అందుబాటులోకి రాకపోవడంతో వైసీపీకి విష్ణు గుడ్ బై చెప్పేసినట్లేనని టాక్ వస్తోంది.