కవిత పరువు పోగొట్టుకుంటున్నారా ?

అనవసరమైన మాటలు మాట్లాడటం వల్ల నేతలు తమ పరువును తామే తీసేసుకుంటారు. అందుకనే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇపుడిదంతా ఎందుకంటే కల్వకుంట్ల కవిత వ్యవహారం వల్లే.  ఇంతకీ విషయం ఏమిటంటే ఈమధ్యనే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దెబ్బ నుండి కేసీయార్ అండ్ కో  ఇంకా కోలుకోలేదు. అందుకనే మళ్ళీ ఇక్కడ ఓడిపోతే పరువుపోతుందని సింగరేణి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయద్దని కేసీయార్ నిర్ణయించారు. ఇదే విషయాన్ని కవిత ద్వారా యూనియన్ నేతలకు చేరవేశారు.

కవిత ద్వారా ఎందుకు చేరవేశారంటే సింగరేణిలో గుర్తింపు సంఘం యూనియన్ తెలంగాణా బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్)కు కవిత గౌరవాధ్యక్షురాలు కాబట్టే. యూనియన్ నేతలతో మాట్లాడటమే కాకుండా స్వయంగా కవితే సింగరేణి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయటంలేదని ప్రకటించారు. తర్వాత ఏమైందో ఏమో మరుసటి రోజే ఎన్నికల్లో పాల్గొంటున్నట్లు కవిత ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీబీజీకేఎస్ ఘోరంగా ఓడిపోయింది.

పదేళ్ళు అధికారాలు అనుభవించి, అవినీతి, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ అని ఆరోపణలు ఎదుర్కొన్న యూనియన్ పై సభ్యులు తమ కసినంతా తీర్చుకున్నారు. మొత్తం 11 ఏరియాలకు ఎన్నికలు జరిగితే ఐదుచోట్ల ఏఐటియుసి, ఆరుచోట్ల ఐఎన్టీయూసి గెలిచాయి. ఇక టీబీజీకేఎస్ విషయానికి వస్తే ఒక ఏరియాలో మూడు ఓట్లు, మరో ఏరియాలో ఒక్కటంటే ఒక్క ఓటు మాత్రమే వచ్చాయి. దీంతోనే జనాలంతా ఆ యూనియన్ పై ఎంతమంటతో ఉన్నారో అర్ధమవుతోంది.

తమ యూనియన్ కు వచ్చిన ఓట్లను చూసి కవితే సిగ్గుపడాలి. అలాంటిది తమ యూనియన్ అసలు గుర్తింపు సంఘం ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయలేదని ప్రకటించటం ఆశ్చర్యంగా ఉంది. పోటీచేయకుండానే బ్యాలెట్ పేపర్లో టీబీజీకేఎస్ పేరు ఎలాగ వచ్చిందో కవితే సమాధానం చెప్పాలి. వాస్తవ పరిస్ధితులను అంచనా వేయకుండా గుడ్డిగా ఎన్నికల్లోకి దిగి పరువు పోగొట్టుకున్నది చాలక అసలు ఎన్నికల్లోనే పోటీచేయలేదని చెప్పి మరోసారి కవిత పరువు పోగొట్టుకున్నారు. అసెంబ్లీ ఓటమి నుండి కవిత ఇంకా తేరుకోలేదని అర్ధమవుతోంది.