బీజేపీ పొత్తు ఖాయమైనట్లేనా?

రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసి నడవటానికి  బీజేపీ రెడీ అయ్యిందా ? అవుతోందా ? ఇపుడిదే చర్చ నడుస్తోంది. జనసేనతో తెలుగుదేశంపార్టీకి పొత్తు కుదిరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే బీజేపీ లేకుండా కేవలం జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళటం  చంద్రబాబుకు ఇష్టంలేదు. అందుకనే బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. ఇంతకాలం ఈ విషయమై ఏమీతేల్చని బీజేపీ అగ్రనేతలు తాజాగా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

ఈమధ్యనే ఢిల్లీలో జరిగిన పదాధికారుల సమావేశంలో ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు విషయం ప్రస్తావనకు వచ్చిందట. అప్పుడు అగ్రనేతలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. బీజేపీ ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధనరెడ్డి మీడియాతో మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో తమతో పొత్తుకు రెడీ అయ్యే పార్టీ 75 అసెంబ్లీ, 12 లోక్ సభ సీట్లను కేటాయించాలని కండీషన్ పెట్టారు. బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్న పార్టీ టీడీపీ తప్ప  మరోపార్టీలేదు. కాబట్టి విష్ణు చెప్పిన కండీషన్ టీడీపీని ఉద్దేశించి చేసిందే అని అర్ధమవుతోంది. అంటే టీడీపీతో పొత్తుకు బీజేపీ రెడీ అవుతోందని అర్ధమవుతోంది.

సీట్ల విషయంలో విష్ణు ఏదో గాలిమాటలు మాట్లాడారు కాని నిజంగానే అన్ని సీట్లిచ్చేస్తే గట్టి అభ్యర్ధులు లేరన్న విషయం అందరికీ తెలుసు. అయితే టీడీపీ వర్గాల సమాచారం ప్రకారం బీజేపీకి మ్యాగ్జిమమ్ 10 అసెంబ్లీ సీట్లిచ్చే అవకాశాలున్నాయట. ఇదే సమయంలో లోక్ సభ సీట్లు ఎన్నికేటాయించే అవకాశాలున్నాయో క్లారిటి రావటంలేదు. చంద్రబాబు దృష్ణంతా అసెంబ్లీ మీదే ఉందికాబట్టి బీజేపీకి కాసిన్ని ఉదారంగా సీట్లిచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

జనవరి మొదటివారంలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళబోతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో వీలైతే నరేంద్రమోడీని లేకపోతే అమిత్ షా, జేపీ నడ్డాలతో భేటీ అయి పొత్తును ఫైనల్ చేసుకుంటారని చెబుతున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత రెండుపార్టీలు అధికారికంగా పొత్తును ప్రకటించే అవకాశాలున్నాయని సమాచారం. ఏదేమైనా ఏపీ రాజకీయాలు కాస్త సంక్లిష్టంగానే మారుతున్నాయి. ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుందనే విషయంలో అయోమయం తొందరలోనే క్లియర్ అవుతుందనే అనుకుంటున్నారు.