వైసీపీపై కేసులు.. అవినీతి బ‌య‌ట పెడ‌తా:  ఆర్కే

ఇటీవ‌ల వైసీపీకి, ఎమ్మెల్యే ప‌ద‌వికి కూడా ఏక‌కాలంలో రాజీనామా చేసిన మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి ఉర‌ఫ్ ఆర్కే.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లోనే తాను వైఎస్ ష‌ర్మిల వెంట న‌డ‌వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు చెప్పారు. అయితే.. ఆమె కాంగ్రెస్‌లోకి వ‌స్తేనేనన‌ని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉంటాను అనేది కాలం నిర్ణయిస్తుందన్న ఆయ‌న‌.. వైసీపీకి  నేను ఎంత సేవ చేశానో త‌న‌కు తెలుసని వ్యాఖ్యానించారు. నేను సర్వస్వం పోగొట్టుకున్నాను.. అని అన్నారు.

వైఎస్ ష‌ర్మిల వెంట న‌డుస్తాన‌ని ఆర్కే చెప్పారు.  తాను వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తినేన‌ని, షర్మిలమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఆమె వెంట ఉంటాననిచెప్పారు. “నేను షర్మిలను కలిశాను. షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా అప్పుడు నా నిర్ణయం ఉంటుంది“ అని వ్యాఖ్యానించారు. ఇదే స‌మ‌యంలో వైసీపీపై ఆర్కే సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేశారు. పార్టీకి తానెంతో చేశాన‌ని, ఎన్నో అవ‌మానాలు కూడా భ‌రించాన‌ని చెప్పారు. వైసీపీకి సిద్దాంతాలు ఉండాలని ఉండాల‌న్నారు.

అతేకాదు.. వైసీపీ  ఎంచుకున్న అభ్యర్థులను గెలిపించాలంటే ఆ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి చెయ్యాలని, కానీ, అలా చేయ‌కుండా.. అభ్య‌ర్థుల‌ను ఎలా గెలిపించుకుంటార‌ని ప్ర‌శ్నించారు. మంగళగిరి ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారనిచెప్పారు. 1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి 120 కోట్లను మాత్రమే కేటాయించారని అన్నారు.  మంగళగిరి అభివృద్ధికి నిధులు విడుదల కాలేదని.. అయినా తాను సొంత నిధులు ఖ‌ర్చు పెట్టిన‌ట్టు చెప్పారు.

“చేసిన ప‌నుల‌కు బిల్లులు ఇవ్వ‌లేదు. దీంతో కాంట్రాక్టర్లు నాపై ఒత్తిడి తెచ్చారు. దీంతో  సీఎంవోకు పదే పదే వెళ్లి అడిగాను. స్వయంగా నేనే 8 కోట్ల వరకు బయట అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చాను. నా సొంత డబ్బుతో దుగ్గిరాల పరిధిలో అభివృద్ధి పనులు చేసా. లోకేష్ ను ఓడించిన నాకు సహకారం అందించకపోతే ఎలా?  నేను ఎవరిని నిందించడం లేదు. నాకు ధనుంజయ రెడ్డి(సీఎంవో అధికారి) చాలా సార్లు మేసేజీలు పెట్టారు నిధులు మంజూరు చేస్తానని చెప్పారు. ఎన్నికలు దగ్గరకు వచ్చినా ఎప్పుడు నిధులు మంజూరు చేస్తారని ప్ర‌శ్నించా. అయినా స‌మాధానం లేదు” అని ఆర్కే అన్నారు.

రాజీనామా ఆమోదించకపోవడం అనేది వైసీపీ ఇష్ట‌మ‌ని ఆర్కే పేర్కొన్నారు. తాను స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా ఇచ్చానని తెలిపారు. మంగళగిరి ప్రజలకు తాను దూరంగా ఉండనన్న ఆర్కే.. ఎవరు గెలవాలి అనేది ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. తాను ఏ పార్టీలో చేరేదీ త్వ‌ర‌లోనే చెబుతాన‌న్నారు. తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు సీఎం జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు. చాలా మంది త‌న‌ను త‌మ  పార్టీలోకి రావాలని ఆహ్వానించారని ప‌రోక్షంగా ఓ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాన్నిఉద్దేశించి వ్యాఖ్యానించారు.

వైసీపీ ప్రభుత్వం తప్పు చేస్తే వాటిపై కేసులు వేసేందుకు అయినా వెనకాడనని ఆర్కే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తప్పులు ఎవరు చేశారు అనేది  న్యాయ స్థానాలు తెలుస్తాయన్నారు.  “నాకు, చిరంజీవికి ,జగన్ కి మధ్య ఏమి జరిగింది అనేది మా అందరికీ తెలుసు. నేను టికెట్ లేదని పార్టీని వీడలేదు.” అని ఆర్కే వ్యాఖ్యానించారు.