జ‌న‌సేన‌కు కూడా వ్యూహ‌క‌ర్త కావాలా…!

ప్ర‌స్తుతం వ్యూహ‌క‌ర్తల హవా రాజ‌కీయాల్లో ఎలా ఉందో తెలిసిందే. ఏపీ విష‌యానికి వ‌స్తే.. ప్ర‌తి ప్ర‌ధాన పార్టీకీ ఒక వ్యూహ‌క‌ర్త ఉన్నాడు. కాంగ్రెస్‌కు సునీల్ క‌నుగోలు ఉన్న‌ట్టుగానే.. టీడీపీకి ప్ర‌స్తుతం రాబిన్ శ‌ర్మ ఉన్నారు. భ‌విష్య‌త్తులో ప్ర‌శాంత్ కిషోర్ వ‌స్తాడా? రాడా? అనేది ప‌క్క‌న పెడితే.. ప్ర‌స్తుతం రాబిన్ శ‌ర్మ నేతృత్వంలోనే టీడీపీ వ్యూహాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇక‌, వైసీపీకి ఐప్యాక్ ఉండ‌నే ఉంది.

అంటే మొత్తంగా ప్ర‌ధాన పార్టీల‌కు వ్యూహ‌క‌ర్త‌లు నిండుగా ఉన్నారు. ఇక‌, ఇప్పుడు అంద‌రి దృష్టీ జ‌న‌సేన పై ప‌డింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ పార్టీ అధికారంలోకి రావాల‌నే భావ‌న‌తో ఉంది. టీడీపీతో జ‌త‌క‌ట్ట‌డం ద్వా రా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం పంచుకునేందుకు రెడీ అవుతోంది. అయితే.. పొత్తు విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. పార్టీలో ఊపు తెచ్చేందుకు, నాయ‌కుల‌కు స‌రైన ద‌శ , దిశ క‌ల్పించేందుకు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న క‌స‌ర‌త్తు ఏమీ క‌నిపించ‌డం లేదు.

దీంతో పార్టీ త‌ల‌పోస్తున్న‌ది ఒక‌టి.. నాయ‌కులు కోరుకుంటున్న‌ది మ‌రొక‌టి.. అన్న‌ట్టుగా ఉంది. పైగా పొత్తు విష‌యంలో జ‌న‌సేన అధినేత వాద‌న ఒక‌ర‌కంగా ఉంటే.. క్షేత్ర‌స్తాయిలో ప‌రిస్థితి మ‌రో విదంగా ఉంది. దీంతో రాజ‌కీయంగా పార్టీలో గ్యాప్ క‌నిపిస్తోంది. ఇక‌, వ్యూహాత్మ‌కంగా పార్టీ న‌డిపించే ప‌రిస్థితి కూడా క‌నిపించ‌డం లేదు. ఇది పార్టీకి మైన‌స్‌గా మారింది. ముందు ర‌హ‌దారులపై గోతులు అని కొంత నిర‌స‌న వ్య‌క్తం చేశారు. త‌ర్వాత కౌలు రైతుల ఆత్మ‌హ‌త్య‌లు అన్నారు.

నేరుగా ప‌వ‌న్ వారి ఇళ్ల‌కు వెళ్లి ఓదార్చారు. ఆర్థిక సాయం కూడా చేశారు. అయితే.. ఇంత చేసినా.. ఆయా వ‌ర్గాల‌ను కానీ, ప‌ట్టణ, న‌గ‌ర స్థాయి ఓటర్ల‌ను కానీ.. జ‌న‌సేన ఆక‌ర్షించ‌లేక పోయింద‌నే వాద‌న ఉంది. పోనీ.. ఈ ఓట్లు మావే అని చెప్పుకొనగ‌లిగిన ప‌రిస్థితిలో కూడా జ‌న‌సేన లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇదంతా కూడా వ్యూహాల‌లేమితోనే జ‌రుగుతున్నాయ‌నేది నెటిజ‌న్ల టాక్‌. అందుకే.. ఇత‌ర పార్టీల‌కు ఉన్న‌ట్టుగానే జ‌న‌సేన‌కు కూడా ఒక వ్యూహ‌క‌ర్త ఉంటే బెట‌రేమో.. అనే సూచ‌న‌లు వస్తుండ‌డం గ‌మ‌నార్హం.