పబ్జీ సహా 118 చైనా యాప్ లు బ్యాన్

భారత్-చైనా సరిహద్దులో ఉన్న గాల్వాన్ లోయలో కొద్ది నెలల క్రితం ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జరిగిన ఉద్రిక్త ఘటనలలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఆ ఘటన తర్వాత చైనాపై భారత్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బ్యాన్ చైనా ప్రొడక్ట్స్, బాయ్ కాట్ చైనా యాప్స్ అనే నినాదం ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే టిక్ టాక్ సహా 59 చైనా యాప్స్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా, మరోసారి భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జీ గేమ్ తో పాటు చైనాకు చెందిన 118 మొబైల్‌ యాప్స్‌పై నిషేధం విధించినట్లు కేంద్రం వెల్లడించింది. దేశ సార్వభౌమత్యం, సమగ్రతకు విఘాతం కలిగిస్తున్నాయన్న కారణంతోనే చైనా అప్లికేషన్లపై నిషేధం విధించినట్లు కేంద్రం తెలిపింది.

పబ్జీ గేమ్ కు యువతతోపాటు చిన్న పిల్లలు కూడా బానిసలవుతున్నారన్న సంగతి తెలిసిందే. ఆ మాయదారి గేమ్ వల్ల ఎంతోమంది ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయారని, దానిని నిషేధించాలని చాలాకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్రం వారి ఆకాంక్షలకు అనుగుణంగా చర్యలు తీసుకుంది. ఎంతోమందిని పొట్టనబెట్టుకున్న పబ్జీ గేమ్ తో పాటు 118 యాప్ లపై కేంద్రం నిషేధం విధించింది. దేశ భద్రతకు, ప్రజా జీవితానికి హానికరంగా పరిణమించిన ఈ యాప్ లను నిషేధించామని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. పబ్జీతోపాటు లివిక్, పబ్జీ మొబైల్ లైట్, వుయ్ చాట్ వర్క్, వుయ్ చాట్ రీడింగ్ వంటి పలు యాప్ లను కేంద్రం నిషేధించింది. ఇక, భారత్ తరహాలోనే అమెరికా చైనా యాప్ లపై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే.