వైసీపీ కోసం ఐ ప్యాక్! టీడీపీ కోసం పీకే?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో రాజకీయ వ్యూహకర్తి ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పీకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దేశ రాజకీయాలలోనే సీనియర్ రాజకీయ నాయకుడని, తనను కలవాలని కోరడంతోనే ఆయనతో భేటీ అయ్యానని పీకే వెల్లడించారు. అయితే, మర్యాదపూర్వకంగానే చంద్రబాబును కలిశానని పీకే చెప్పారు.

మరోవైపు, తాము వైసీపీతోనే ఉన్నామంటూ ఐ ప్యాక్ సంస్థ అధికారికంగా తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. గత ఏడాది కాలంగా వైసీపీతో ఐప్యాక్ కలిసి పనిచేస్తోందని ఆ సంస్థ స్పష్టం చేసింది. 2024 ఎన్నికల్లో సీఎం జగన్ ఘన విజయం సాధించి మరోసారి అధికారం చేపడతారని, ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలను మరింత మెరుగుపరుస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. అలా చేయడమే లక్ష్యంగా వైసీపీతో కలిసి అంకితభావంతో అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని ఐ ప్యాక్ టీం వెల్లడించింది.

ఐ ప్యాక్ తాజా ప్రకటనతో ఐప్యాక్ కు ప్రశాంత్ కిషోర్ కు సంబంధం లేదని స్పష్టమైనట్టు కనిపిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు అరెస్టును ఐప్యాక్ టీం వ్యతిరేకించిందని, కానీ జగన్ వారి మాటలను పెడచెవిన పెట్టి ముందుకు వెళ్లారని తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే మీడియాలో చంద్రబాబు అరెస్టు వార్త వచ్చేవరకు ఐ ప్యాక్ సభ్యులకు తెలియకపోవడంతో జగన్ వ్యవహర శైలికపై ఐ ప్యాక్ కూడా గుర్రుగా ఉందని తెలుస్తోంది.

అయితే, ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం మరికొంత కాలం వైసీపీతోనే ఐప్యాక్ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అంటే, వైసీపీ కోసం ఐ ప్యాక్…చంద్రబాబు కోసం పీకే పని చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే, టీడీపీ కోసం పనిచేయబోతున్నానని పీకే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.